
నాలుగు రకాల సర్వేలు చేయించాననీ, అన్నింటిలో టీడీపీనే విజయం సాధిస్తుందని తేలిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్షగా నిలిచాయని అభిప్రాయపడ్డారు. ఇవాళ నంద్యాల లోక్ సభ నియోజకవర్గ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక దగ్గర నిర్వహించిన ఈ సమావేశానికి పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ సరళి, కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అలసత్వానికి అవకాశం ఇవ్వరాదనీ, కౌంటింగ్ ముగిసేవరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఎన్నికలు ప్రతీ ఐదేళ్లకు ఓసారి వస్తుంటాయనీ, పార్టీ శాశ్వతమన్నారు బాబు. ఎన్నికల్లో పోటీచేయడం ఒక్కటే ముఖ్యం కాదని అభిప్రాయపడ్డారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయన్నారు. రాష్ట్ర, దేశ రాజకీయాలను టీడీపీ నేతలంతా అధ్యయనం చేయాలని సూచించారు. అంతేకాదు ప్రకృతి మనకు బాగా కలసివచ్చిందని…. లబ్ధిదారులకు చేయాల్సినంత సంక్షేమం చేశామన్నారు. వాస్తవానికి ఈ ఎన్నికలు మే నెలలో రావాలి… కానీ తొలిదశలోనే ఎన్నికలు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. తక్కువ గడువు ఇచ్చి టీడీపీని దెబ్బతీయాలనుకున్నారు. కానీ ఇదే టీడీపీకి కలిసి వచ్చింది. చెడు చేయాలనుకున్నా, మంచే జరిగింది. ఇకపై ప్రతినెల మొదటివారంలో లబ్ధిదారులకు పెన్షన్లు, ఆర్థికసాయం అందుతాయన్నారు చంద్రబాబు. మే 23న కౌంటింగ్లో టీడీపీ గెలుపు లాంఛనం మాత్రమేనన్నారు.
మోడీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదు..
మళ్లీ నరేంద్రమోడీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు.’ దేశంలో బీజేపీ ఓటమి ఖాయం అయ్యిందన్నారు. మోడీ పాలనలో ఏపీకి జరిగిన అన్యాయంపై పోరాడాం. గత 5ఏళ్లలో దేశానికి జరిగిన నష్టంపై పోరాడాం. మొన్న పశ్చిమ బెంగాల్లో టీఎంసీకి అనుకూలంగా ప్రచారం చేశాం. మళ్లీ మోడీ ప్రధాని అయ్యే ప్రసక్తే లేదు. మోడీ… 28ఏళ్ల క్రితం చనిపోయిన రాజీవ్ గురించి మాట్లాడుతున్నారు. సైన్యం త్యాగాల ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. మోడీ ఏం చేయలేదు కాబట్టే ప్రజలకేమీ చెప్పలేని స్థితిలో ఉన్నారు’ అని బాబు ఆరోపించారు.