
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భక్తులకు ఉచిత లడ్డూ, పులిహోరా ప్రసాదం పంపిణీ కార్యక్రమం శనివారం (June 15) ప్రారంభమైంది. లడ్డూ ప్రసాదాన్ని ఆలయ ఈవో వెంకటరావు, చైర్మన్ నరసింహమూర్తి భక్తులకు స్వయంగా పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రతి శనివారం లడ్డూ, మిగిలిన రోజుల్లో పులిహోరా ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం స్వామిని దర్శించుకుని ఆలయం వెలుపలికి వచ్చే పశ్చిమ రాజగోపురం వద్ద ఉచిత ప్రసాద పంపిణీ కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆలయంలో నిత్య కైంకర్యాల ద్వారా శనివారం ఆలయానికి రూ.49,88,217 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఆఫీసర్లు తెలిపారు.