ఇండియా – ఇంగ్లాండ్ మధ్య ఈ నెల 25 నుంచి 29 వరకు ఉప్పల్ స్టేడియంలో జరిగే క్రికెట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు కల్పించాలని రాచకొండ సీపీ సుధీర్బాబు పేర్కొన్నారు. క్రికెట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన భద్రతా ఏర్పాట్ల పై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులతో బుధవారం ఉప్పల్ స్టేడియంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ.. ప్రేక్షకులు భారీగా వచ్చే అవకాశం ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్నిరకాల సెక్యూరిటీ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
స్టేడియం పరిసరాల్లో సీసీ టీవీలు, అవసరమైన వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మల్కాజిగిరి డీసీపీ పద్మజ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, వైస్ ప్రెసిడెంట్ దల్జిత్ సింగ్, సెక్రటరీ దేవరాజు, అడ్మిన్ డీసీపీ ఇందిర తదితరులు పాల్గొన్నారు.