Success: భవిష్యత్​ తరాల వనరులు : నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా

Success:  భవిష్యత్​ తరాల వనరులు : నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా

ప్రస్తుత ప్రజల కనీస అవసరాలను తీరుస్తూ భవిష్యత్ తరాల వారికి వనరులను మిగిల్చేలా వాటిని వివేకవంతంగా వినియోగించుకోవడం ద్వారా సాధించే అభివృద్ధిని సుస్థిరాభివృద్ధి అని పిలుస్తారు. భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ఉండాలని సుస్థిరాభివృద్ధి సూచిస్తుంది. 

మానవ సంక్షేమాన్ని పెంపొందించుకోవడానికి ఆర్థికవృద్ధి ఒక్కటే సరిపోదు, వనరుల వినియోగం, పునర్​ కల్పనల మధ్య సమతుల్యతలను ఏర్పరిచి అభివృద్ధి ప్రక్రియను కొనసాగిస్తే సుస్థిర అభివృద్ధి సాధ్యపడుతుంది. కాబట్టి ప్రస్తుత కాలంలో అభివృద్ధి వ్యూహాలు, సమాజం, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణం సామూహిక అభివృద్ధికి ప్రాధాన్యతను ఇస్తున్నాయి. 

మానవ జనాభా  పెరిగే కొద్దీ అవసరాల కోసం అభివృద్ధి పేరుతో సహజ వనరులను పరిమితికి మించి వినియోగించడం వల్ల భూ, జల వనరులు, వాతావరణం కలుషితమై అనేక పర్యావరణ సమస్యలకు దారితీస్తుంది. పేదరికం, తాగునీటి సమస్య, అంటువ్యాధులు ప్రబలి సామాజిక సమస్యలకు దారి తీయడమే కాకుండా వనరుల కొరత తీవ్రమై భవిష్యత్తు తరాల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. 

నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమట్ ఛేంజ్ ప్లాన్ 

ఇది శీతోష్ణస్థితి మార్పులపై భారత్ మొదటి కార్యాచరణ ప్రణాళిక. దీనిని 2008, జూన్ 30న మన్మోహన్​సింగ్ విడుదల చేశారు. దీని ముఖ్యోద్దేశం శీతోష్ణస్థితిలో మార్పులకు కారణమైన గ్రీన్​హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గించడం, కాలపరిమితితో కూడిన కాలుష్యరహిత అభివృద్ధి పథకాల ద్వారా పర్యావరణ పరిరక్షణ చేపట్టడం. ఇందులో భాగంగా భారతదేశం వివిధ రంగాలకు చెందిన ఎనిమిది రకాల మిషన్స్ చేపట్టి ఉద్గారాలను తగ్గించి సుస్థిరాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఎనిమిది రకాల మిషన్స్ ఈ విధంగా ఉన్నాయి. 

జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ సిస్టమ్

 

  • సౌర విద్యుత్తును ప్రోత్సహించడం, అభివృద్ధి పరచడం
  •  పట్టణాలు, పరిశ్రమలు, ఇతర వాణిజ్య సంబంధ నిర్మాణాల వద్ద సోలార్ ఎలక్ట్రిసిటీ వినియోగాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టడం.
  •  ప్రతి సంవత్సరం సోలార్ విద్యుత్ సామర్థ్యం పెరిగేలా  సౌర విద్యుత్తు ఉత్పత్తి. 

నేషనల్ మిషన్ ఫర్ ఎన్​హన్స్​డ్​ ఎనర్జీ ఎఫిషియెన్సీ

దీని ప్రధాన లక్ష్యం విద్యుత్తును ఆదా చేయడం, దీనికి విద్యుత్ వినియోగ పరికరాలకు రేటింగ్ ఇవ్వడం, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణంలో పీపీపీ విధానాన్ని ప్రోత్సహించడం.

నేషనల్ మిషన్ ఫర్ సస్టయినబుల్ హాబిటెట్

విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ చేపట్టడం, హరిత ప్రజా రవాణాను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆవాసాలను అభివృద్ధి పరుచుకోవడం దీని ముఖ్యోద్దేశం.

నేషనల్ వాటర్ మిషన్

సమీకృత నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాను అరికట్టడం, అభిలషణీయమైన రీతిలో నీటి వినియోగానికి సంబంధించి అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని 20 శాతానికి పెంచడం.

నేషనల్ మిషన్ ఫర్ సస్టెయినింగ్ ది హిమాలయన్ ఎకో సిస్టమ్

దీని ప్రధాన ఉద్దేశం సుస్థిరాభివృద్ధి పథకాల ద్వారా హిమాలయ ప్రాంతాల్లో జీవవైవిధ్య సంరక్షణ, అటవీ సంరక్షణ, హిమానీనదాల పరిరక్షణను చేపట్టడం. 


నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా

ప్రస్తుతం ఉన్న 23 శాతం అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచడం, నాశనమైన అటవీ భూమిలో 10 మిలియన్ హెక్టార్లలో మొక్కలను పెంచే కార్యక్రమం చేపట్టడం. 2020 నాటికి కార్బన్ శోషక వనరుల సామర్థ్యాన్ని 50 నుంచి 60 మిలియన్ టన్నులకు పెంచడానికి తగిన చర్యలు తీసుకోవడం.

నేషనల్ మిషన్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్

వ్యవసాయ శీతోష్ణస్థితి ప్రాంతాల్లో వ్యూహాత్మక ప్రణాళికల ద్వారా పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల పెంపొందించడం, సాంకేతికపరమైన మౌలిక వస్తువుల సామర్థ్యాన్ని పెంపొందిస్తూ తగిన వ్యవసాయ మౌలిక వస్తువులను అభివృద్ధి చేసుకోవడం. ఇందులో ముఖ్యమైన అంశాలు.. ఎ. శీతోష్ణస్థితికి అనుకూలమైన పంటల ఎంపిక. బి. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను మళ్లించడం. 

నేషనల్ మిషన్ ఆన్ స్ట్రాటజిక్ నాలెడ్జ్ ఫర్ క్లైమెట్ ఛేంజ్

శీతోష్ణస్థితి శాస్త్రం ప్రకారం సవాళ్లు తదితర అంశాలపై అధ్యయనం, తదనుగుణంగా చేపట్టే చర్యలకు రూపకల్పన చేయడం.

 బచావత్ ల్యాంప్ యోజన

సుస్థిరాభివృద్ధిలో భాగంగా ఇంధన పొదుపు కోసం చేపట్టిన కార్యక్రమం. 2009లో ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. ముఖ్యోద్దేశం సంప్రదాయ బల్బుల స్థానంలో అదే ధరకు కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్ (సీఎఫ్ఎల్) బల్బులను అందించడం, దీన్ని క్యోటో ప్రొటోకాల్లోని క్లీన్ డెవలప్​మెంట్ మెకానిజాన్ని (సీడీఎం) ఉద్దేశించి అమలు చేస్తున్నారు.  వీటి వల్ల కాలుష్యం తగ్గుతుంది.