న్యూఢిల్లీ: జపాన్ కార్ల తయారీ కంపెనీ టయోటా ఫ్లెక్స్ ఫ్యూయల్- స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఎఫ్ఎఫ్వీ) చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ను కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మంగళవారం ఢిల్లీలో ప్రారంభించారు. -పైలట్ ప్రాజెక్ట్ కోసం టయోటా బ్రెజిల్ నుండి దిగుమతి చేసుకున్న టయోటా కరోలా ఆల్టిస్ (ఎఫ్ఎఫ్వీ–ఎస్హెచ్ఈవీ) ని మంత్రి లాంచ్ చేశారు. ఈ వెహికల్ను పూర్తిగా ఇథనాల్తో నడుపుతారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, రవాణా రంగం వల్ల ఇది మరింత ఎక్కువ అవుతున్నదని అన్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్తోపాటు, ఇథనాల్, మిథనాల్ వంటి జీవ ఇంధనాలతో నడిచే బండ్ల వాడకాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గడ్కరీతో పాటు కేంద్ర మంత్రులు మహేంద్ర నాథ్ పాండే, భూపీందర్ యాదవ్, టయోటా కిర్లోస్కర్ మోటార్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. బ్రెజిల్లో ఇది వరకే టయోటా ఫ్లెక్స్ ఫ్యూయల్ -స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీని పరిచయం చేసింది. ఇలాంటి వెహికల్స్లో ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్తో పాటు ఎలక్ట్రిక్ పవర్ట్రెయిన్ ఉంటాయి. ఇథనాల్ అయిపోతే కారు ఈవీ మోడ్లోకి వెళ్లిపోతుంది. ఫ్లెక్స్- కార్లు ఒకటి కంటే ఎక్కువ రకాల ఇంధనం మిశ్రమంతో కూడా నడుస్తాయి. సాధారణంగా పెట్రోల్కు ఇథనాల్ కలుపుతారు.