
యాదగిరిగుట్ట, వెలుగు : తెలంగాణలోని ప్రధాన దేవాలయాల్లో ఉన్న ఖాళీలను రెగ్యులర్ బేసిస్ లో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రధాన దేవాలయాల ఉద్యోగుల సంఘం జేఏసీ చైర్మన్ గజవెల్లి రమేశ్ బాబు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. యాదగిరిగుట్ట పాతగోశాల ప్రాంగణంలోని లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ లో గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు హెల్త్ కార్డులు, పీఆర్సీ అమలు చేయాలని కోరారు. దేవాలయాల్లో ఉన్న పోస్టులకు అనుగుణంగా జీవో 888, 261ను సవరించాలన్నారు. ప్రభుత్వం మానవతాదృక్పధంతో ఆలోచించి రిటైర్మెంట్, అనారోగ్యంతో బాధపడుతున్న ఉద్యోగులను తిరిగి మాతృ సంస్థలకు బదిలీ చేయాలని పేర్కొన్నారు.
సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి వినతిపత్రం అందజేస్తామని వెల్లడించారు. సమావేశంలో టీఎన్జీవో సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు జగదీష్, వేములవాడ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీను, భద్రాచలం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, బాసర అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్, పలు ఆలయాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.