
హైదరాబాద్: ఓబులాపురం మైనింగ్ కేసులో ఖైదీగా చంచల్ గూడ జైలులో ఉన్న కర్నాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి CBI కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు చంచల్ గూడ జైలులో ‘A’ క్లాస్ సౌలతులు కల్పించాలని గాలి పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో గాలి జనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో గాలి అభ్యర్థనలు కొత్తేం కాదు. తీర్పు ప్రకటించడానికి ముందు కూడా గాలి జనార్దన్ రెడ్డి సహా మిగతా దోషులను ‘చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా?’ అని జడ్జి ప్రశ్నించారు.
జనార్దన్ రెడ్డి స్పందిస్తూ.. తన వయసును, తాను చేసిన సామాజిక సేవలను గుర్తించి, శిక్షను తగ్గించాలని కోరారు. దీంతో ‘ఈ కేసులో పదేండ్ల శిక్ష ఎందుకు వేయకూడదు?’ అని జడ్జి ప్రశ్నించారు. తాను ఇప్పటికే నాలుగేండ్లకుపైగా సామాజిక సేవ చేస్తున్నానని, బళ్లారితో పాటు గంగావతిలో తనను ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించారని జనార్దన్ రెడ్డి తెలిపారు. తన సేవలను గుర్తించినందుకే ప్రజలు గెలిపించారని చెప్పుకున్నారు. చివరకు ఆయనకు ఏడేండ్ల శిక్షను ఖరారు చేసినట్టు జడ్జి తీర్పును ప్రకటించారు.
ఉమ్మడి ఏపీ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో సంచలనం సృష్టించిన ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సహా నలుగురిని సీబీఐ స్పెషల్ కోర్టు దోషులుగా తేల్చింది. నలుగురికీ ఏడేండ్ల జైలుశిక్షతోపాటు రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది. ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అప్పటి ఐఏఎస్ కృపానందరెడ్డిని నిర్దోషులుగా ప్రకటించింది. దాదాపు 15 ఏండ్ల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన నాంపల్లిలోని సీబీఐ స్పెషల్ కోర్టు ఈ కేసులో ఇటీవల తుది తీర్పు వెలువరించిన విషయం విదితమే.
ఈ కేసులో ఓబులాపురం మైనింగ్ కంపెనీ(ఓఎంసీ) ఓనర్ గాలి జనార్దన్ రెడ్డి, ఆయన పర్సనల్ అసిస్టెంట్ మెహ్ఫాజ్ అలీ ఖాన్, కంపెనీ ఎండీ బీవీ శ్రీనివాస్ రెడ్డి, అప్పటి మైనింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వీడీ రాజగోపాల్ గతంలోనే బెయిల్పై విడుదలయ్యారు. తాజాగా వీరిని దోషులుగా తేల్చిన కోర్టు.. జ్యుడీషియల్ కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించింది.