హైకోర్టు తీర్పుతో ఆగిన లీగ్ మ్యాచ్లు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెటర్లు, క్లబ్ సెక్రటరీలు
అడ్మినిస్ట్రేటర్ల నిర్లక్ష్యం వల్లే
ఈ పరిస్థితి అని విమర్శలు
హైదరాబాద్, వెలుగు: అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్తో దేశంలోనే అత్యంత చెత్త అసోసియేషన్గా చెడ్డ పేరు తెచ్చుకుంటున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) క్రికెటర్ల జీవితాలతో ఆటలాడుతోంది. అసోసియేషన్ పెద్దల మధ్య ఆధిపత్య పోరుతో ఆటగాళ్లు నలిగిపోతున్నారు. ఇప్పటికే అనేక కుంభకోణాలు, టీమ్ సెలెక్షన్స్లో కరప్షన్ ఆరోపణలతో వార్తల్లో నిలిచిన హెచ్సీఏ అధికారులు చేసిన తప్పిదంతో ఇప్పుడు ఈ సీజన్ మొత్తాన్ని కోల్పోయే ప్రమాదంలో నిలిచారు. యూనియన్ బ్యాంక్ టీమ్ను లీగ్ మ్యాచ్ల్లో ఆడించాలన్న హైకోర్టు ఆర్డర్ను అమలు చేయని హెచ్సీఏ ఇప్పుడు మొత్తం లీగ్లను అర్ధంతరంగా ఆపేయాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు బుధవారం అన్ని లీగ్ మ్యాచ్లను నిలిపివేశామని సెక్రటరీ విజయానంద్ తెలిపారు. మంగళవారమే కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ.. కమ్యునికేషన్ గ్యాప్ కారణంగా బుధవారం ఉదయం త్రీ డే ఎ– డివిజన్ లీగ్ల సెకండ్ డే ఆట కొనసాగించారు. కానీ, విజయానంద్ సూచన మేరకు లంచ్ తర్వాత ఆట ఆగిపోయింది. లీగల్ అడ్వైజ్ తీసుకున్న తర్వాత మ్యాచ్లను ఆపేశామని, కోర్టు నుంచి అనుమతి వచ్చాకే హెచ్సీఏ లీగ్ ఫోర్త్ రౌండ్ మ్యాచ్లను తిరిగి కొనసాగిస్తామనిసెక్రటరీ తెలిపారు. దాంతో, ఈ సీజన్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న క్రికెటర్లంతా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.
నిర్లక్ష్యమే ముంచింది..
అసోసియేషన్ పెద్దల నిర్లక్ష్యం వల్లనే ఈ సీజన్ లీగ్ మ్యాచ్లను ఆపేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చే పరిస్థితి వచ్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో ప్రెసిడెంట్ అజరుద్దీన్, సెక్రటరీ విజయానంద్ వ్యవహారశైలిపై విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రాబ్యాంక్ను విలీనం చేసుకున్న యూనియన్ బ్యాంక్ టీమ్ను లీగ్స్లో ఆడించాలని హైకోర్టు ఇది వరకే తీర్పు ఇచ్చింది. కానీ, సమస్యను పరిష్కరించేందుకు లీగల్ అడ్వైజ్ తీసుకుంటామని ప్రెసిడెంట్ మహ్మద్ అజరుద్దీన్ చెప్పడంతో కొన్ని రోజులు వృథా అయ్యాయి. వారం తర్వాత యూనియన్ బ్యాంక్ను లీగ్లో ఆడించాలని లీగ్స్ ఇన్చార్జ్ అయిన జాయింట్ సెక్రటరీ నరేశ్ శర్మకు విజయానంద్ లెటర్ రాశారు. దాంతో, ప్రస్తుతం జరుగుతున్న త్రీ డే లీగ్లో ప్లేయర్ల పేర్లు రిజిష్టర్ చేయించుకోవాలని యూనియన్ బ్యాంక్కు సమాచారం ఇచ్చారు. కానీ, సడెన్గా యూ టర్న్ తీసుకున్న విజయానంద్.. ఆ టీమ్ను లీగ్లో ఆడించేందుకు మరికొన్ని రోజులు వెయిట్ చేయాలని నరేశ్ శర్మకు సూచించారు. దాంతో, న్యాయం కోసం యూనియన్ బ్యాంక్ మరోసారి కోర్టును ఆశ్రయించింది. హెచ్సీఏ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు మొత్తం లీగ్లపైనే స్టే విధించడంతో అసలుకే మోసం వచ్చింది.
ప్లేయర్లకు తీరని నష్టం
ఈ మొత్తం ఎపిసోడ్లో ప్లేయర్లే తీవ్రంగా నష్టపోతున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే చాలా ఆలస్యంగా మొదలైన 2020-21 లోకల్ సీజన్ మొత్తం గందరగోళంగా మారేలా ఉంది. సాధారణంగా జూన్-జులైలో మొదలవ్వాల్సిన సీజన్ గత నెలలోనే స్టార్ట్ అయ్యింది. లీగ్ స్టార్ట్ విషయంలోనూ ప్రెసిడెంట్ అజర్, సెక్రటరీ విజయానంద్ వర్గాల మధ్య చాలా రోజుల పాటు వివాదం నడిచింది. డబ్బులు తీసుకొని అర్హత లేని జట్లను లీగ్లో చేర్చారన్న ఆరోపణలూ వచ్చాయి. ఎట్టకేలకు సీజన్ మొదలైనా.. నాలుగో రౌండ్తోనే అర్ధంతరంగా ఆగిపోవడంతో హెచ్సీఏ అడ్మినిస్ట్రేషన్పై అటు ప్లేయర్లు, ఇటు క్లబ్ సెక్రటరీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్లేయర్ల కెరీర్తో హెచ్సీఏ చెలగాటం ఆడుతోందని ఓ క్లబ్ సెక్రటరీ విమర్శించారు. లీగ్ మ్యాచ్లను, క్రికెట్ను హెచ్సీఏ అధికారులు ఓ జోక్గా మార్చేశారని దుయ్యబట్టారు. హైకోర్టు తీర్పు వారికి చెంపపెట్టు అని అభిప్రాయపడ్డారు. హెచ్సీఏ పెద్దల తీరుతో విసుగుచెంది ఇప్పటికే హనుమ విహారి, అంబటి రాయుడు వంటి స్టార్లు హైదరాబాద్ టీమ్ను విడిచి ఆంధ్ర టీమ్కు తరలివెళ్లారు. ఇప్పుడు జూనియర్ ప్లేయర్ల భవిష్యత్ కూడా ప్రశ్నార్థకంగా మారుతోంది. మరి, ఇప్పటికైనా హెచ్సీఏ పెద్దల తీరు మారుతుందో లేదో చూడాలి.
ప్రభుత్వ ఆఫీసుల తీరు మారాలి
సోషల్ మీడియాలో ఆడవాళ్లపై పెరిగిన వేధింపులు
రూ.50 లక్షల లోపు ఇండ్లకు ఫుల్ డిమాండ్

