
- హే ‘గాంధీ’.. ఏందీ యాతన?
- పెద్ద ఆసుపత్రిలో 24 గంటలుగా నీళ్లు లేవ్
- కంపుకొడుతున్న వాష్రూమ్స్
- ఎమర్జెన్సీ సేవలకు అంతరాయం
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ దవాఖానలో నీటి సరఫరా నిలిచిపోవడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి సరఫరా చేసే పంప్హౌస్లో ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ కావడంతో శుక్రవారం రాత్రి 8.30 గంటల నుంచి ఆయా వార్డులు, ఎమర్జెన్సీ విభాగాల్లో నీళ్లు రావడం లేదు.
ఫలితంగా వైద్య సేవలకు అంతరాయం కలగడంతోపాటు వాష్రూమ్స్ కంపు కొడుతున్నాయి. శనివారం రాత్రి వరకు కూడా నీటి సరఫరా పునరుద్దరించలేదు. ఫలితంగా బయట షాపుల్లో వాటర్ బాటిళ్లు కొనుగోలు చేస్తున్నట్లు రోగి సహాయకులు వాపోయారు. రెండు రోజులు వరుసగా సెలవులు రావడంతో అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అయితే, ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో జనరేటర్ల ద్వారా నీటి సరఫరా పునరుద్ధరిస్తున్నట్లు సూపరింటెండెంట్ డా. రాజకుమారి తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.