
డెహ్రాడూన్: ఉత్తరాఖాండ్లో మరో విమాన ప్రమాదం జరిగింది. భక్తులను కేదార్ నాథ్కు తీసుకెళ్తున్న విమానం నడి రోడ్డుపై కుప్పకూలింది. శనివారం (జూన్ 7) ఉదయం రుద్రప్రయాగ్ జిల్లాలోని బదాసు ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అధికారుల వివరాల ప్రకారం.. క్రెస్టెల్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన ఒక విమానం చార్దమ్ యాత్రలో భాగంగా శనివారం (జూన్ 7) ఐదుగురు భక్తులను కేదార్ నాథ్ తీసుకెళ్లేందుకు సిర్సి హెలిప్యాడ్ నుంచి టేకాఫ్ అయ్యింది.
టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టెక్నికల్ ఇష్యూ గుర్తించిన ఫైలెట్ విమానాన్ని రుద్రప్రయాగ్ జిల్లాలోని బదాసు ప్రాంతంలో రోడ్డుపై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. రోడ్డుపై ఉన్న ఓ కారును ఢీకొని విమానం తోక భాగం విరిగిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న రెస్య్కూ టీమ్స్ ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సదరు విమాన సంస్థ డీజీసీఏకి సమాచారం అందించింది. ఈ ఘటనపై డీజీసీఏ ఆరా తీసింది.
చార్ ధామ్ మార్గంలో 30 రోజుల వ్యవధిలో జరిగిన నాలుగవ హెలికాప్టర్ ప్రమాదం ఇది. మే 8న గంగోత్రి సమీపంలో ఒక హెలికాప్టర్ కూలిపోయి ఆరుగురు భక్తులు మరణించిన విషయం తెలిసిందే. మే 12న బద్రీనాథ్ హెలిప్యాడ్ వద్ద ఒక వాహనాన్ని హెలికాప్టర్ బ్లేడ్ ఢీకొనడంతో మరో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇదిలా ఉండగానే మే 17న హెలిప్యాడ్ సమీపంలో ల్యాండ్ అవుతుండగా దాని విమానం వెనక భాగం నేలకు తాకడంతో కేదార్నాథ్ ప్రాంతంలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలింది.
ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. పైలట్, డాక్టర్, నర్సింగ్ సిబ్బంది ముగ్గురు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. తాజాగా జూన్ 7న భక్తులను కేదార్ నాథ్కు తీసుకెళ్తున్న విమానం నడి రోడ్డుపై కుప్పకూలింది. రుద్రప్రయాగ్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. చార్ దమ్ యాత్ర మార్గంలో వరుస విమాన ప్రమాదాలతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఫ్లైట్ సర్వీస్ సేఫ్టీపై భక్తుల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.