వాకిటి శ్రీహరి​ అనే నేను..మంత్రిగా ప్రమాణ స్వీకారం

వాకిటి శ్రీహరి​ అనే నేను..మంత్రిగా ప్రమాణ స్వీకారం

వాకిటి శ్రీహరిఅనే నేను.. అంటూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.వాకిటి శ్రీహరి  తో.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. మక్తల్​ నియోజకవర్గం నుంచి   కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వాకిటి శ్రీహరి​..  మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారానంతరం వేదికపైనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

ఎన్ఎస్​యూఐ ప్రెసిడెంట్​గా  రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన మక్తల్​ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మినిస్టర్​దాకా ఎదిగారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఏడాదిలోనే ఆయనను మంత్రి పదవి వరించింది. వాకిటి శ్రీహరిది రైతు కుటుంబం. ప్రస్తుతం నారాయణపేట జిల్లాలోని మక్తల్​లో నర్సింహులు, రాములమ్మ దంపతులకు ఆయన జన్మించారు. తండ్రి వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించగా.. తల్లి రాములమ్మ నర్సుగా పనిచేసేవారు.  శ్రీహరి ఫస్ట్​ క్లాస్​ నుంచి టెన్త్​ వరకు మక్తల్​ గవర్నమెంట్​ స్కూల్​లో, ఇంటర్​, డిగ్రీ పాలమూరులో పూర్తి చేశారు. 2000 ఏప్రిల్ 23న శ్రీహరికి  లలితతో వివాహం జరిగింది.  భర్త సహకారంతో లలిత కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు. 2006లో దాసర్​పల్లి నుంచి ఎంపీటీసీగా పోటీ చేసి గెలుపొందారు. అదే ఏడాది మక్తల్​ మండల కాంగ్రెస్​ పార్టీ ప్రెసిడెంట్​గా 2011 వరకు పని చేశారు.  

రాజకీయ ప్రస్థానం..

డిగ్రీ పూర్తి చేశాక వాకిటి శ్రీహరి రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్ఎస్ యూఐ ప్రెసిడెంట్​గా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. మొదట 1990–-93 వరకు మక్తల్​ మండల ఎన్ఎస్ యూఐ ప్రెసిడెంట్​గా, 1993–-96 వరకు మక్తల్​ మండల యూత్​ కాంగ్రెస్​ ప్రెసిడెంట్​గా, 1996–-2001 వరకు మక్తల్​ మండల సెక్రటరీగా, 2001-–06 వరకు మహబూబ్​నగర్​ జిల్లా కాంగ్రెస్​ పార్టీ వైస్​ ప్రెసిడెంట్​గా పనిచేశారు.  2001లో మక్తల్​ మేజర్​ గ్రామ పంచాయతీ నుంచి  భారీ మెజార్టీతో మొదటిసారి సర్పంచ్​గా ఎన్నికయ్యారు. 

2010–14లో జరిగిన జడ్పీటీసీ ఎలక్షన్స్​లో  రాష్ట్రంలోనే భారీ మెజార్టీతో గెలిచిన జడ్పీటీసీల్లో రెండో స్థానంలో నిలిచారు. 2018 వరకు జడ్పీ ఫ్లోర్​ లీడర్​గా పని చేశారు. 2022 నుంచి 2024 ఫిబ్రవరి వరకు నారాయణపేట డీసీసీ ప్రెసిడెంట్​గా బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మక్తల్​ సెగ్మెంట్​ నుంచి శ్రీహరి పోటీ చేశారు. తన సమీప అభ్యర్థి చిట్టెం రాంమోహన్​ రెడ్డిపై 17,525 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 

35 ఏండ్లుగా కాంగ్రెస్​ సేవలోనే..

శ్రీహరి కుటుంబం మొదటి నుంచీ కాంగ్రెస్​ పార్టీలోనే ఉంది. దాదాపు 35 ఏండ్లుగా వీరు కాంగ్రెస్​ పార్టీ కోసం పనిచేస్తున్నారు. మధ్యలో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా.. గట్టిగా నిల్చున్నారు. ప్రభుత్వాలు మారి ఇబ్బందులు వచ్చినా.. కాంగ్రెస్​ పార్టీ కోసం కష్టపడి పని చేశారు. శ్రీహరితోపాటు ఆయన సోదరుడు శేషగిరి కూడా క్రియాశీల రాజకీయాల్లో రాణిస్తున్నారు. 2006లో ఈయన మక్తల్​ ఉప సర్పంచ్​గా పని చేశారు. అదే ఏడాది మహబూబ్​నగర్​ జిల్లా యూత్​ కాంగ్రెస్ వైస్​ ప్రెసిడెంట్​గా 2014 వరకు పని చేశారు. ​మక్తల్​ మేజర్​ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అప్​గ్రేడ్​ కావడంతో శేషగిరి భార్య రాధిక 2019లో మున్సిపల్​ ఎన్నికల్లో కౌన్సిలర్​గా గెలుపొంది, కాంగ్రెస్​ ఫ్లోర్​ లీడర్​గా పని చేశారు. ప్రస్తుతం శేషగిరి అన్నతో పాటే ఉంటున్నారు.