దిస్పూర్: త్వరలో జరగనున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 42 మంది పేర్లతో కూడిన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ను మంగళవారం (మార్చి 3) రిలీజ్ చేసింది. అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ గౌరవ్ గొగోయ్ జోర్హాట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. మరో సీనియర్ నాయకుడు రిపున్ బోరా బర్చల్లా నుంచి పోటీ చేస్తున్నారు.
సిల్చార్ నుంచి అభిజిత్ పాల్, మజులి నుంచి ఇంద్రనీల్ పెగు, దిస్పూర్ నుంచి మీరా బోర్తాకూర్ గోస్వామి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా, 126 మంది సభ్యులు కలిగిన అస్సాం శాసనసభకు 2026 మార్చి-ఏప్రిల్లో ఎన్నికలు జరగనున్నాయి. త్వరలోనే ఈసీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించే అవకాశం ఉంది.
►ALSO READ | యూట్యూబ్ లో మోదీ రికార్డ్.. 3 కోట్లు దాటిన సబ్ స్క్రైబర్లు
బీజేపీ నేతృత్వంలోని అధికార ఎన్డీఏ కూటమిని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈసారి ఎలాగైనా అస్సాంలో మూడు రంగుల జెండా ఎగరేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే ఎన్నికల షెడ్యూల్ రాకముందే అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థుల లిస్ట్ను ప్రకటించి కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది.
