- అమెరికా సైనిక స్థావరాల నుంచి బ్రిటన్ దాడులు
- ఖతార్ వైపు దూసుకెళ్తున్న ఇరాన్ డ్రోన్ కూల్చివేత
లండన్: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కేవలం ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలకే పరిమితమయ్యేలా కనిపించడం లేదు. గ్లోబల్ పవర్ హౌస్లుగా పిలవబడే బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు నేరుగా రంగంలోకి దిగడంతో పరిస్థితులు భయంకరంగా మారుతున్నాయి. తాజాగా ఇరాన్ ప్రతీకార దాడులను అడ్డుకునేందుకు తాము అమెరికాతో కలిసి పనిచేస్తామని ఈ మూడు దేశాలు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బ్రిటన్ ప్రధాని సర్ కీర్ స్టార్మర్ ఒక వీడియో సందేశం ద్వారా ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.
ఇరాన్ క్షిపణి కేంద్రాలపై దాడులు చేసేందుకు తమ దేశ సైనిక స్థావరాలను ఉపయోగించుకోవాలని అమెరికా కోరగా.. దానికి బ్రిటన్ పచ్చజెండా ఊపింది. అంతేకాకుండా, ఖతార్ వైపు దూసుకెళ్తున్న ఒక ఇరాన్ డ్రోన్ను బ్రిటన్కు చెందిన రాయల్ ఎయిర్ ఫోర్స్ టైఫూన్ ఫైటర్ జెట్ కూల్చివేయడం ఉద్రిక్తతలను పరాకాష్టకు చేర్చింది.
శనివారం నాటి దాడుల తర్వాత బ్రిటన్ నేరుగా యుద్ధంలో పాలుపంచుకోవడం ఇదే తొలిసారి. అలాగే, ఇరాన్ చేస్తున్న విచక్షణారహిత క్షిపణి దాడులను సహించేది లేదని ఈ యూరోపియన్ దేశాల నేతలు స్పష్టం చేశారు. కేవలం రక్షణకు మాత్రమే పరిమితం కాకుండా.. తమ ప్రయోజనాలకు విఘాతం కలిగించే క్షిపణులు, డ్రోన్ల తయారీ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి కూడా వెనుకాడబోమని ఇరాన్ ను హెచ్చరించారు. ఇది ఇరాన్కు డైరెక్ట్ వార్ వార్నింగ్ అని చెప్పుకోవచ్చు.
