- త్వరలో మరో 10 బంకులు ఏర్పాటుకు సన్నాహాలు
- జీసీసీ భూములు, ఆస్తుల లెక్క తీస్తున్న అధికారులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకులు లాభాల్లోకి చేరుకున్నాయి. గిరిజన జిల్లాల్లో మొత్తం 31 పెట్రోల్ బంకులు ఉండగా, గత 3 నెలల క్రితం వరకు 12 మాత్రమే బ్రేక్ ఈవెన్లో నడవగా.. మిగతావి నష్టాల్లో నడిచాయి. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది చేతివాటం, ఒరిజనల్ లెక్కలను ఉన్నతాధికారులకు చెప్పకపోవడం వంటి ఆరోపణలు వచ్చాయి. దీంతో జీసీసీ ఉన్నతాధికారులు ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పాటు అవినీతికి పాల్పడిన సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. ఈ క్రమంలో గత నెల నుంచి మొత్తం 31 బంకులు లాభాల బాటలోకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
ఒక్కో పెట్రోల్ బంకు నెలకు రూ.లక్ష పైనే ఆదాయం వస్తుందని అధికారులు అంటున్నారు. గతంలో పెట్రోల్ బంకుల సిబ్బందే ఆయిల్ కంపెనీలకు డిజిల్, పెట్రోల్ కొనుగోలుకు నగదు చెల్లించాయి. ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. ఇప్పుడు హైదరాబాద్లోని జీసీసీ హెడ్ ఆఫీస్ నుంచి నేరుగా ఆయిల్ కంపెనీలకు నగదు చెల్లిస్తున్నారు. మరోవైపు, రాష్ట్రవ్యాప్తంగా మరో 10 జీసీసీ పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ 31 బంకుల రెవెన్యూతో కొత్త బంకులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. నాగర్ కర్నూలు జిల్లాలో 5 బంకులు ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు ప్రభుత్వ స్థలాలు చూడాలని జిల్లా ట్రైబల్ అధికారులను ఆదేశించినట్లు ఆ అధికారి తెలిపారు.
గిరిజనుల సంక్షేమం కోసం, గిరిజన యువతకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పెట్రోల్ బంకులను ఏర్పాటు చేసింది. భద్రాచలంలో 8, ఏటూరు నాగరం 12, ఉట్నూరు డివిజన్ లో 11 ఉన్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా జీసీసీకి ఉన్న భూములు, బిల్డింగ్స్ లెక్కలు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వీటిని ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జీసీసీకి విలువైన భూములు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా జీసీసీకి ఉన్న భూములు, బిల్డింగ్స్ లెక్కలు తీసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వీటిని ఆన్లైన్లో ఎంట్రీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జీసీసీకి విలువైన భూములు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
