పాముకాటుతో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు వస్తే .. స్టూల్​ మీద కూర్చోబెట్టి ట్రీట్​మెంట్

పాముకాటుతో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు వస్తే .. స్టూల్​ మీద కూర్చోబెట్టి ట్రీట్​మెంట్

ములుగు, వెలుగు : పాముకాటుతో బుధవారం రాత్రి ఓ బాలిక ములుగు జిల్లా దవాఖానకు రాగా బెడ్లు ఖాళీ లేవంటూ ఆమెను కుర్చీపై కూర్చోబెట్టి ట్రీట్​మెంట్​ఇచ్చారు. గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన గుండెబోయిన నాగలక్ష్మి, అనిల్​దంపతుల బిడ్డ సాహితీ బుధవారం రాత్రి ఇంటివద్ద ఉండగా పాము కాటేసింది. దీంతో ఆమెను ములుగు జిల్లా దవాఖానకు తీసుకువచ్చారు. అయితే, బెడ్లు ఖాళీ లేవని చెప్పిన సిబ్బంది ఆమెను స్టూల్​ పై కూర్చోబెట్టి సెలైన్ ​బాటిల్ ​ఎక్కించారు. 

తల్లిదండ్రులు ఇదేంటని ప్రశ్నించగా చిన్నపిల్లల వార్డు, జనరల్​వార్డులు ఫుల్​అయ్యాయని, అందుకే ఇలా ట్రీట్​మెంట్ అందిస్తున్నామని చెప్పారు. చివరకు తెల్లవారుజామున ఐసీయూలో బెడ్ ​ఖాళీ కావడంతో అందులో జాయిన్​ చేసుకున్నారు. గురువారం సాయంత్రం వరకు అబ్జర్వేషన్​లో పెట్టి కోలుకోవడంతో ఇంటికి పంపారు. దవాఖాన సూపరింటెండెంట్ ​డాక్టర్ ​జగదీశ్​ ను వివరణ కోరగా సీజనల్ వ్యాధులతో దవాఖానలో 100 బెడ్స్​ ఖాళీగా లేవని, అయినా కూడా ఎవరినీ బయటకు పంపకుండా చికిత్స చేస్తున్నామన్నారు. గురువారం కూడా 130మంది పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చామని చెప్పారు.