చెన్నై: 13 ఏళ్ల ఓ పాపను ఇంటికి దగ్గర్లో ఉండే, దగ్గరి బంధువే రేప్ చేసి కాలువలో పడేశాడు. నీటిలో ఊపిరాడక ఆ బాలిక మృతిచెందింది. తమిళనాడులోని మయిలదుథురై జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తల్లి, ముగ్గురు తోబుట్టువులతో కలిసి బాలిక మయిలదుథురై జిల్లాలో నివసిస్తోంది. ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. తండ్రి కొన్నేళ్ల కిందట చనిపోయాడు. తల్లి రోజు కూలీగా పని చేస్తోంది. బాలిక పెద్ద అక్క ఓ సూపర్ మార్కెట్లో, ఇద్దరు అన్నలు వేర్వేరు యూనిట్లలో పని చేస్తున్నారు. ఓ బోర్వెల్ కంపెనీలో పని చేసే 24 ఏండ్ల నిందితుడు.. బాలిక కుటుంబానికి బంధువు. వాళ్ల ఇంటికి దగ్గర్లోనే ఉంటున్నాడు. మాయ మాటలు చెప్పి, ఒత్తిడి చేసి బాలికతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు. అక్టోబర్ 7న దగ్గర్లోని బంధువుల ఇంటికి వెళ్లొస్తానని తల్లికి చెప్పి బాలిక బయటికెళ్లింది. కానీ తిరిగి రాకపోవడంతో ఆమె కోసం తల్లి, అన్నలు, అక్క వెతికారు. వాళ్లతో పాటు నిందితుడు కూడా వెతుకుతున్నట్టు నటించాడు. కుథలం పోలీస్ స్టేషన్లో రాత్రి కుటుంబీకులు కంప్లైంట్ చేశారు. అర్ధరాత్రి 1 గంటకు గ్రామంలోని ఓ డ్రైనేజ్లో బాలిక డెడ్బాడీని గ్రామస్తులు గుర్తించారు. బాలికను రేప్ చేసినట్టు పోస్టుమార్టంలో తేలింది. పోలీసుల దర్యాప్తులో బంధువే నిందితుడని, ధోతిని బాలిక గొంతుకు బిగించి కాలువలో పడేశాడని తేలింది. దీంతో ఊపిరాడక ఆమె చనిపోయిందని పోలీసులు వెల్లడించారు.