
- రైతు ఖాతాల్లో నిధులు జమ
- తొలిరోజు 2 ఎకరాల వరకు పెట్టుబడి సాయం
- 41.25 లక్షల మంది రైతుల అకౌంట్లలోకి రూ.2,349 కోట్లు
- ఎకరంలోపు రైతులకు రూ.812.6 కోట్లు
- రెండెకరాల వరకు రూ.1,537.2 కోట్లు
హైదరాబాద్, వెలుగు: రైతులకు వానాకాలం పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు భరోసా’ నిధులను విడుదల చేసింది. 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో సోమవారం పెట్టుబడి పైసలు పడ్డాయి. ఒక్క రోజులోనే 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 2,349.83 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఎకరం లోపు భూమి ఉన్న 24.22 లక్షల మంది రైతులకు రూ. 812.6 కోట్లు, రెండెకరాల వరకు భూమి ఉన్న 17.02 లక్షల మంది రైతులకు రూ. 1,537.2 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది.
కాగా, మిగిలిన రైతులందరికీ వచ్చే 9 రోజుల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రకటించారు. ఈ సారి ముందస్తు వర్షాలు ప్రారంభమైనందున రైతులు ఇప్పటికే సాగు పనులు ప్రారంభించారు. దుక్కులు దున్ని పత్తి విత్తనాలు వేయడంతోపాటు నార్లు పోసుకుంటున్నారు. దీంతో తాజాగా అందుతున్న పెట్టుబడి సాయం పైసలు ట్రాక్టర్ల కిరాయిలకు, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, కూలీల ఖర్చుకు ఉపయోగపడనున్నాయి. కాగా, జూన్లో నే వానకాలం పంట పెట్టుబడి సాయం అందడం ఇదే మొదటిసారి కావడం విశేషం.