
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ దవాఖాన్లలో నవజాత శిశువులకు ముర్రుపాలు పట్టించిన నర్సులకు ప్రభుత్వం ఇన్సెంటివ్ ప్రకటించింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు రాష్ట్రంలోని 92 దవాఖాన్లలో మొత్తం 2,63,200 ప్రసవాలు జరిగినట్టు తెలిపింది.
వీరిలో నవజాత శిశువులకు ముర్రుపాలు పట్టించిన సిబ్బందికి మొత్తం రూ.42,11,200 ప్రోత్సాహకం ప్రకటించింది. మొదటి విడతగా రూ.21,05,600 విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం అయిన తర్వాత నిర్ణీత గడువులోగా ముర్రుపాలు పట్టిస్తే ఒక్కో శిశువుకు రూ.20 చొప్పున ప్రభుత్వం నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తోం ది. దానిని ప్రసవంలో భాగస్వాములైన లేబర్ రూం సిబ్బందికి పంపిణీ చేస్తారు. తమ సేవ లు గుర్తించి ఇన్సెంటివ్ ప్రకటించినందుకు ప్రభుత్వానికి నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రుడావత్ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.