
- సెర్ప్ ఆధ్వర్యంలో 184 గోదాముల నిర్మాణానికి ప్రణాళిక
- ఒక్కో నిర్మాణానికి రూ.15 లక్షలు కేటాయింపు
- ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలకు 85 గోడౌన్ల బాధ్యతలు
- 100 గిడ్డంగుల బాధ్యతలు మండల సమాఖ్యలకు
హైదరాబాద్, వెలుగు: రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) ఆధ్వర్యంలో మినీ గోదాముల నిర్మాణానికి కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఒక్కో గోదాము నిర్మాణానికి రూ.15 లక్షలు కేటాయించింది. ఈ గోదాములను నిర్మించి మహిళా సంఘాలకు అప్పగించాలని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 184 మినీ గోదాములను నిర్మిస్తుండగా.. అందులో 100 గోదాముల నిర్వహణ బాధ్యతలను మండల సమాఖ్యలకు, 84 గోదాముల బాధ్యతలను ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలకు అప్పగించనున్నారు. గోదాముల నిల్వ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, డీపీఆర్ లను సిద్ధం చేయడానికి నాబ్ కిసాన్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 184 గోదాములు..
రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర రానప్పుడు దళారులకు అమ్ముకొని నష్టపోకుండా ధాన్యం నిల్వ చేసుకునేలా మినీ గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గోదాముల నిర్వహణ బాధ్యతలను మహిళా రైతు సంఘాలు, మండల సమాఖ్యలకు అప్పగించనున్నామని సెర్ప్ అధికారులు తెలిపారు. గోడౌన్ల నిర్మాణం కోసం మండలాల్లో అనువైన ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని మండలాల్లో ప్రభుత్వ భూములను గుర్తించినట్లు సమాచారం.
ఒక్కో గిడ్డంగిలో ఎన్ని క్వింటాల ధాన్యం స్టోరేజీ చేయాలో నాబ్ కిసాన్ సంస్థ.. అంచనాలను రూపొందిస్తుంది. ఆయా మండలాల్లో ప్రభుత్వ స్థలాలను గుర్తించి వీలైనంత త్వరగా గోదాములు నిర్మించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లా కలెక్టర్లు కూడా స్థల సేకరణపై ప్రత్యేక దృష్టిసారించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. త్వరలో గోదాముల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గోదాములు లేక ఇబ్బందులు
రైతులు తమ ధాన్యం నిల్వ చేసుకునేందుకు సరైన చోటు లేక అరిగోస పడుతున్నారు. ధర ఎంత ఉన్నా.. దళారులకు విక్రయించుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంట్లో ధాన్యం నిల్వ చేసుకునేందుకు స్థలం లేకపోవడం, వర్షాభావ పరిస్థితుల నుంచి గట్టెక్కడానికి మరో మార్గం లేకపోవడంతో పండించిన ధాన్యాన్ని వెంటనే దళారులకు విక్రయించుకోవాల్సి పరిస్థితి ఉంది. దీంతో రైతుల అవసరాన్ని దళారులు అవకాశంగా చేసుకుంటున్నారు.
తాము చెప్పిందే వేదం అన్నట్లుగా.. వారు ఫిక్స్ చేసిన రేటుకే రైతులు తమ ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. వీటన్నింటినీ గమనించిన రాష్ట్ర ప్రభుత్వం.. రైతులకు దళారుల బెడద నుంచి విముక్తి కల్పించడంతోపాటు మద్దతు ధరతో ధాన్యం విక్రయించుకునేలా మినీ గోదాములను అందుబాటులోకి తీసుకొస్తున్నది. రైతులు తమ ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేసుకోవడంతోపాటు ధరలు పెరిగినప్పుడు అమ్ముకోవచ్చు. ఈ గోదాముల నిర్మాణం, నిర్వహణను సెర్ప్ పర్యవేక్షించనున్నది. దీనిపై మహిళా సంఘాలకు, సమాఖ్యలకు శిక్షణ అందించనుంది.
త్వరలో నిర్మాణ పనులు
మినీ గోదాముల నిర్మాణానికి ఇప్పటికే స్థలాలు గుర్తించిన మండలాల్లో నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తుండటంతో వారికే మినీ గోదాముల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నది. రాష్ట్ర చరిత్రలోనే ఇది ప్రథమం. 31 జిల్లాల్లో మినీ గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతుండగా అత్యధికంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో నిర్మిస్తున్నారు. ఆదిలాబాద్లో 11, భద్రాద్రి కొత్తగూడెంలె 4, హన్మకొండలో 1, జగిత్యాలలో 2, జనగాం 3, జయశంకర్ 2, జోగుళాంబ గద్వాల 1, కామారెడ్డి 4, కరీంనగర్ 1, ఖమ్మం 8, మహబూబాబాద్ 10, మహుబూబ్నగర్ 2, మంచిర్యాల 3, మెదక్ 3, మేడ్చల్5, నిర్మల్14, నిజామాబాద్ 11, సూర్యాపేట 15, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 13 గోదాములు నిర్మించనున్నారు.