
హైదరాబాద్, వెలుగు : గ్యారంటీలు, ఉచితాల పేర్లతో ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. పేదలకు శాశ్వత ప్రయోజనం కల్పించాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ సర్కార్కు ఏమాత్రం లేదని విమర్శించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ పతాకాన్ని లక్ష్మణ్ ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
‘‘రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్నట్టు ఉంది. ఇప్పుడు తెలంగాణ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కార్తో అభివృద్ధి జరుగుతున్నది. కాంగ్రెస్ చేయలేని పనులను బీజేపీ చేసి చూపించింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తాం. 33% మహిళా రిజర్వేషన్లు, అయోధ్యలో రామ మందిరం నిర్మించిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుంది’’అని లక్ష్మణ్ అన్నారు.
ఎవరి సిఫారసు లేకుండా తెలుగు తేజాలకు పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు దక్కడం గొప్ప విషయమని, ఇది మోదీ మార్క్ పాలన అని కొనియాడారు. ‘‘రాజ్యాంగ బద్ధంగా మోదీ పాలన సాగిస్తున్నారు. ఇండియాను ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక దేశంగా తీర్చిదిద్దారు. ఎన్నికల కోసం కాకుండా.. భావితరాల బాగుకోసం పనిచేసే నాయకుడు నరేంద్ర మోదీ’’అని లక్ష్మణ్ ప్రశంసించారు.
.