హైదరాబాద్, వెలుగు: నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, కలల సాకారం కోసం ‘తెలంగాణ రైజింగ్ –2047’ విజన్ డాక్యుమెంట్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్రాన్ని భౌగోళికంగా కాకుండా, అభివృద్ధి ప్రామాణికంగా మూడు విభిన్న జోన్లుగా (క్యూర్-, ప్యూర్,- రేర్) విభజించిన రాష్ట్రంగా తెలంగాణ నిలవనుండటం ఈ విజన్ డాక్యుమెంట్ ప్రత్యేకత. గ్లోబల్ సమిట్ వేదికగా మొత్తం 83 పేజీల డాక్యుమెంట్ను రాష్ట్ర ప్రజల ముందు ఉంచింది. ఇప్పటికే ప్రపంచంలోని ప్రధాన నగరాలతో పోటీ పడుతోన్న తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్ను ‘నెట్-జీరో సిటీ’గా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
నైట్టైం క్యాపిటల్గా హైదరాబాద్
పల్లెల నుంచి పట్నం దాకా.. గుడి నుంచి అడవి దాకా అన్నింటినీ లింక్ చేస్తూ టూరిజం సర్క్యూట్లకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచడం, లోకల్ కల్చర్ను గ్లోబల్ రేంజ్కు తీసుకెళ్లడం అనే లక్ష్యాలను పెట్టుకుంది. హైదరాబాద్ను సౌత్ ఆసియాలోనే ‘నైట్ టైమ్ క్యాపిటల్’గా మార్చేందుకు ప్లాన్ రెడీ చేసింది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సులు రాత్రి 2 గంటల వరకు నడిచేలా ప్లాన్చేస్తున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్, ట్యాంక్ బండ్, ఓల్డ్ సిటీ, ఎయిర్ పోర్టు ఏరియాలను నైట్ జోన్లుగా మారుస్తారు.
చార్మినార్ టు గోల్కొండ వయా ట్యాంక్ బండ్ మీదుగా ‘హైదరాబాద్ ఆఫ్టర్ డార్క్ మైల్’ పేరుతో నైట్ బజార్లు, ఫుడ్ ఫెస్టివల్స్ ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలను కలుపుతూ 27 స్పెషల్ టూరిజం ఏరియాలను గుర్తించారు. టూరిస్టుల కోసం టికెట్లు, బుకింగ్స్, ట్రావెల్ అన్నీ ఒకే కార్డుతో అయ్యేలా ‘తెలంగాణ పాస్’ (యూనిఫైడ్ డిజిటల్ పాస్) తీసుకురానున్నారు. నాగార్జునసాగర్, సోమశిల, రామప్ప, కాళేశ్వరం అందాలను ఆకాశం నుంచి చూసేందుకు హెలికాప్టర్ రూట్లను ఏర్పాటు చేయనున్నారు. భువనగిరిని ‘రాక్ క్లైంబింగ్ డెస్టినేషన్’గా.. అమ్రాబాద్, కవ్వాల్ అడవుల్లో ఎకో ట్రయల్స్ ఏర్పాటు చేస్తారు. టైగర్ రిజర్వ్ జోన్లలోనూ రిసార్టులు రానున్నాయి.

