- పామాయిల్ మరింత అగ్గువ
- 12.5 శాతానికి సుంకం తగ్గింపు
- పామాయిల్ డెరివేటివ్లపై బ్యాన్
- ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం
- క్రూడ్ పామాయిల్పైనా తగ్గించాలని తయారీదారుల డిమాండ్
న్యూఢిల్లీ: ఇది వరకే కొన్ని ప్రయత్నాలు చేసినా వంటనూనెల ధరలు తగ్గకపోవడంతో పామాయిల్ దిగుమతులపై సుంకాన్ని 17.5 శాతం నుంచి12.5 శాతానికి తగ్గించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి వరకు ఈ తగ్గింపు అమలవుతుంది. దీనివల్ల దేశంలో పామాయిల్ సప్లై పెరుగుతుంది. ధరలు అదుపులో ఉంటాయి. రిఫైన్డ్ పామాయిల్తోపాటు రిఫైన్డ్ పామోలియన్పైనా బేసిక్ కస్టమ్ డ్యూటీ (బీసీడీ) తగ్గుతుందని సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఈఏ) ప్రకటించింది. ఈ మేరకు సోమవారం రాత్రి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (సీబీఐసీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని వెల్లడించింది. ఇదిలా ఉంటే సోమవారం వేరుసెనగ నూనె కిలోకు రూ.181.48, ఆవాల నూనె రూ.187.43, వనస్పతి రూ.138.5, సోయాబీన్ ఆయిల్ రూ.150.78, పొద్దుతిరుగుడు నూనె రూ.163.18, పామాయిల్ రూ. 129.94 పలికిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డేటా తెలియజేసింది. ఈ విషయమై ఎస్ఈఏ ప్రెసిడెంట్ అతుల్ చతుర్వేది మాట్లాడుతూ క్రూడ్ పామాయిల్పై సుంకం తగ్గించకుండా, పామోలియన్పై తగ్గించడం వల్ల దిగుమతులు పెరుగుతాయని చెప్పారు. దీనివల్ల ఆత్మనిర్భర్ ప్రయత్నాలకు దెబ్బతగులుతుందని, తమ ఇండస్ట్రీలో ఉద్యోగాలు తగ్గుతాయని చెప్పారు. ఆయిల్ ఇండస్ట్రీకి సీపీఓ చాలా ముఖ్యమని చెబుతూ మార్చి వరకు సన్సెట్ క్లాజును తొలగించడం ఒక్కటే ఊరటను ఇచ్చే విషయమని ఆయన చెప్పారు. ఎస్ఈఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా మాట్లాడుతూ క్రూడాయిల్పై (సీఎంఓ) సుంకం ఇప్పటికీ 8.25 శాతం ఉందని, దీనివల్ల ఇండియా పామాయిల్ తయారీ కంపెనీలకు మేలు జరగబోదని అన్నారు. విదేశాల నుంచి కొనుగోళ్లు పెరుగుతాయి తప్ప, తగ్గవని స్పష్టం చేశారు. సీఓఎం, పామోలియన్ డ్యూటీ మధ్య ఇప్పటికీ 5.5 శాతం తేడా ఉందన్నారు.
లైసెన్సు లేకున్నా దిగుమతులు..
బీసీడీ తగ్గించడంతోపాటు వచ్చే డిసెంబరు వరకు లైసెన్సులు లేకుండానే రిఫైన్డ్ పామాయిల్ను దిగుమతి చేసుకోవడానికి కేంద్రం వ్యాపారులకు పర్మిషన్ ఇచ్చింది. ధరలను అదుపులో ఉంచడానికి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ క్రూడ్ పామాయిల్ కొత్త డెరివేటివ్లపై నిషేధం విధించింది. మరికొన్ని అగ్రికమోడిటీల ట్రేడింగ్నూ నిలిపివేసింది. హోల్సేల్ ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయాలను ప్రకటించింది. అంతేగాక ఈ ఏడాదిలో ఇప్పటికే వంటనూనెలపై చాలాసార్లు ఇంపోర్ట్ డ్యూటీలను తగ్గించింది. చివరగా ఈ ఏడాది అక్టోబరులో డ్యూటీని తగ్గిస్తూ ప్రకటన చేసింది. మనదేశంలో ఏటా 22 మిలియన్ టన్నుల వరకు వంటనూనెలు వాడుతున్నారు. ఈ మొత్తం 65 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నారు. గత రెండు మార్కెటింగ్ సంవత్సరాల్లో 13 మిలియన్ టన్నుల వంటనూనెలపై డ్యూటీని తగ్గించారు. 2019–20 ఆయిల్ మార్కెటింగ్ ఇయర్లో రూ.71 వేల కోట్ల విలువైన 13.2 మిలియన్ టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకున్నారు. 2020–21లోనూ దాదాపు ఇంతే మొత్తాన్ని విదేశాల నుంచి కొన్నారు.