- మాజీ మంత్రి హరీశ్పై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో ఐఏఎస్ లను ఏ విధంగా అవమానించారో తెలంగాణ ప్రజలు చూశారని, ఆ అధికారులతో కాళ్లు మొక్కించుకున్న చరిత్ర మీదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ మంత్రి హరీశ్రావుపై ఫైర్ అయ్యారు. బుధవారం హైదరాబాద్ లో మీడియాకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళా కలెక్టర్లను అప్పటి మీ ఎమ్మెల్యేలు అసభ్యంగా తాకి వార్తల్లోకి ఎక్కిన మీరు...ఇప్పుడు ఐఏఎస్ ల గౌరవంపై మాట్లాడడం ఏమిటని మండిపడ్డారు.
మీరు చేసిన అవినీతి వల్ల సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ సస్పెండ్ అయ్యాడని, రాబోయే రోజుల్లో ఆయన ఎక్కడికి పోతాడో అందరికీ తెలుసన్నారు. అధికారులను గౌరవించే తీరు తమ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి తెలుసునని అన్నారు. ఐఏఎస్ ల బదిలీలపై మాట్లాడే అర్హత హరీశ్ రావుకు లేదని, ప్రభుత్వాన్ని విమర్శించేందుకు ఏ విషయాలు లేకపోవడంతో ఆయన అధికారుల బదిలీలపై మాట్లాడుతున్నాడని ఆరోపించారు.
