- జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాలో జీక్యూజీ పెట్టుబడులు
- 4.7 శాతం వాటా కొన్న కంపెనీ
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ షేర్లు పడినప్పుడు ఇన్వెస్ట్ చేసి భారీ లాభాలు పొందిన జీక్యూజీ పార్టనర్స్ తాజాగా జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై కన్నేసింది. ఈ కంపెనీలో 4.7 శాతం వాటా కొన్నట్టు ప్రకటించింది. దీంతో జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రా షేర్లు శుక్రవారం 12 శాతం ర్యాలీ చేశాయి. ఈ యూఎస్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అదానీ గ్రూప్లో పెట్టుబడులు పెట్టిన తర్వాత నుంచి బాగా పాపులర్ అయ్యింది. జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేరును రూ.59.10 వద్ద కొనుగోలు చేసింది. డీల్ మొత్తం విలువ రూ.1,672 కోట్లు. ఈ కంపెనీ షేర్లు శుక్రవారం రూ.69 దగ్గర ముగిశాయి.
కంపెనీలో 7.3 శాతం వాటాను ఏఎస్ఎన్ ఇన్వెస్ట్మెంట్స్ తాజాగా అమ్మింది. వరానియం ఇండియా, ఏ/డీ ఇన్వెస్టర్స్ ఫండ్, దక్కన్ వాల్యూ ఇన్వెస్టర్స్ ఫండ్ కూడా కొంత వాటాలను సేల్ చేశాయి. ఈ నాన్ ప్రమోటర్ ఎంటిటీలన్నీ రూ. 4,136 కోట్ల విలువైన సుమారు 11.8% వాటాను అమ్మాయి. జీక్యూజీతో పాటు నోమురా ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ మదర్ ఫండ్ (ఒక శాతం కొన్నది), ఏపీజీ ఎమెర్జింగ్ మార్కెట్స్ (0.6 %) కూడా జీఎంఆర్ కంపెనీలో వాటాలు కొన్నాయి.