పదో తరగతి ఫలితాల్లో 30వ స్థానంలో హైదరాబాద్​ జిల్లా

పదో తరగతి ఫలితాల్లో 30వ స్థానంలో హైదరాబాద్​ జిల్లా
  • పాస్ ​పర్సంటేజ్​పెరిగినా.. పడిపోయిన ర్యాంకులు
  • 30వ స్థానానికి పరిమితమైన హైదరాబాద్​ జిల్లా
  • 27వ స్థానంలో మేడ్చల్– మల్కాజిగిరి, 24వ స్థానంలో రంగారెడ్డి జిల్లాలు
  • చిట్టచివరి స్థానంలో నిలిచిన వికారాబాద్ జిల్లా 

హైదరాబాద్, వెలుగు: పదో తరగతి ఫలితాల్లో గ్రేటర్ సిటీ మరోసారి డీలా పడింది. హైదరాబాద్​ సహా రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి, వికారాబాద్​జిల్లాలు ర్యాంకులు సాధించడంలో వెనుకబడ్డాయి. గతేడాదితో పోలిస్తే పాస్​పర్సంటేజ్​పెరిగినప్పటికీ, జిల్లాల ర్యాంకులు ఘోరంగా పడిపోయాయి. కార్పొరేట్​స్కూళ్లు, ట్యూషన్స్, ఎక్స్​పర్ట్​ టీచర్లు, సౌకర్యాలు ఉన్నా ఫలితాలు సాధించడంలో వెనుకబడ్డాయి.

ప్రభుత్వ స్కూళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. హైదరాబాద్ జిల్లా గతేడాది 80.92 ఉత్తీర్ణత శాతంతో 28వ స్థానంలో నిలవగా, ఈసారి 86.76 శాతంతో 30వ స్థానానికి పడిపోయింది. స్టూడెంట్ల పాస్ పర్సంటేజ్​పెరిగినా జిల్లా ర్యాంకు తగ్గింది. గతేడాది 90.72 శాతంతో 14వ స్థానంలో నిలిచిన మేడ్చల్–​ మల్కాజిగిరి జిల్లా ఈసారి 89.61శాతంతో 27 స్థానానికి పడిపోయింది.

87.25 శాతంతో గతేడాది 20 స్థానంలో నిలిచిన రంగారెడ్డి జిల్లా ఈసారి 91.01 శాతంతో 24వ స్థానానికి పడిపోయింది. వికారాబాద్​జిల్లాలో ఎలాంటి మార్పులేదు. కిందటేడు 33వ స్థానంలో నిలవగా,ఈసారి కూడా అదే ర్యాంక్​దక్కించుకుంది. 65.10 శాతం మంది మాత్రమే పాస్​అయ్యారు. హైదరాబాద్​జిల్లాలో మొత్తం 73,202 మంది స్టూడెంట్లు ఎగ్జామ్స్​రాయగా, 63,511మంది పాస్​అయ్యారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో 46,736 మంది ఎగ్జామ్స్​రాయగా, 41,873 మంది పాస్​అయ్యారు. రంగారెడ్డి జిల్లాలో 50,811 మంది ఎగ్జామ్స్​రాయగా, 46,245 మంది పాస్​అయ్యారు. వికారాబాద్ జిల్లాలో 13,357 మంది ఎగ్జామ్స్​రాయగా, 8,695 మంది పాస్​అయ్యారు.

హైదరాబాద్​ మళ్లీ వెనక్కి..

హైదరాబాద్ జిల్లా ఏటా చివరి ఐదు స్థానాల్లోనే ఉంటోంది. 2019లో 83.09 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా కారణంగా ఎగ్జామ్స్​జరగలేదు. ఆ రెండేండ్లు టెన్త్​స్డూడెంట్లంతా పాస్​అయ్యారు.  2022లో 79.63 శాతం ఉత్తీర్ణతతో మరోసారి హైదరాబాద్ జిల్లా రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది. 2023లో 80.92 శాతంతో 28 స్థానానికి పరిమితం కాగా, ఈసారి 86.76 మంది పాసైనప్పటికీ జిల్లా ర్యాంక్​30వ స్థానానికి పడిపోయింది. ఆసిఫ్​నగర్ ​ఏరియాలోని గవర్నమెంట్ ​స్కూళ్లలో 70.79 శాతం, గోల్కొండ ఏరియాలో 72.73 శాతం మంది మాత్రమే పాస్​అయ్యారు. జిల్లాలో అత్యధికంగా అమీర్​పేట ఏరియాలోని గవర్నమెంట్ స్కూళ్లలో 87.16 శాతం మంది పాస్​అయ్యారు. మొత్తంగా జిల్లాలోని గవర్నమెంట్​స్కూళ్లలో 78.89 శాతం పాస్​అయ్యారు. ఏటా పదో తరగతి ఫలితాలు వెక్కిరిస్తున్నా అధికారుల తీరులో ఎలాంటి మార్పు రావడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

వికారాబాద్ ​తీరు మారట్లే

పదో తరగతి ఫలితాల్లో వికారాబాద్ జిల్లా మరోసారి చిట్టచివరి స్థానంలో నిలవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేట్​కలిపి మొత్తం 302 స్కూళ్లు ఉన్నాయి. మొత్తం 13,357 మంది ఎగ్జామ్స్​రాయగా, 8,695 మంది మాత్రమే పాస్​అయ్యారు. 6,664 అబ్బాయిలు ఎగ్జామ్స్​రాయగా, 3,821 మంది మాత్రమే పాస్​అయ్యారు. 6,693 మంది అమ్మాయిలు ఎగ్జామ్స్​రాయగా 4,874 మంది పాసయ్యారు.

అమ్మాయిలదే హవా..

పదో తరగతి ఫలితాల్లో ఎప్పటిలాగే మరోసారి అమ్మాయిలు సత్తా చాటారు. హైదరాబాద్ జిల్లాలో 89.90 శాతం అమ్మాయిలు, 83.41 శాతం మంది అబ్బాయిలు, రంగారెడ్డి జిల్లాలో 93.32 శాతం మంది అమ్మాయిలు, 88.89 శాతం మంది అబ్బాయిలు పాస్​అయ్యారు. మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలో 92.03 శాతం మంది అమ్మాయిలు, 87.35 శాతం మంది అబ్బాయిలు, వికారాబాద్​జిల్లాలో 72.82 శాతం మంది అమ్మాయిలు, 57.34 శాతం మంది అబ్బాయిలు పాస్​అయ్యారు. సుల్తాన్​బజార్​గవర్నమెంట్​స్కూల్​స్టూడెంట్ వైజే ప్రతిక్ష, అమీర్​పేట హైస్కూల్​స్టూడెంట్​డి.అక్షిత, హైదర్​గూడ సెయింట్ పీటర్స్ హై స్కూల్ స్టూడెంట్​బోనగరి చరిత, మాసబ్​ట్యాంక్​రెడ్​క్రాస్ ప్రభుత్వ గర్ల్స్​హైస్కూల్ స్టూడెంట్​ జెట్టి జోత్స్నప్రియ 10/10 జీపీఏ సాధించారు.

ఐఏఎస్​ అవుతా

10 జీపీఏ వస్తదని అస్సలు ఊహించలేదు. కష్టపడి చదివా. మా అమ్మ అంగన్​వాడీ టీచర్. నాన్న పెయింటర్. ఇద్దరూ నన్ను చదువులో ఎంకరేజ్ చేశారు. టీచర్ల సహకారం మంచిగుంది. ఐఏఎస్ అవ్వాలనేది నా డ్రీమ్.
– జెట్టి జోత్స్నప్రియ, రెడ్​క్రాస్ గర్ల్స్ హైస్కూల్, మాసబ్​ట్యాంక్