కాంగ్రెస్‌లో ‘గ్రేటర్‌ ’ రాజకీయం

కాంగ్రెస్‌లో ‘గ్రేటర్‌ ’ రాజకీయం

సిటీ ప్రెసిడెంట్‌ పోస్టుకు పోటీ..

ఒక్కొక్కరికీ ఒక్కో సీనియర్​ సపోర్ట్​

మేయర్‌ అభ్యర్థిత్వానికి డిమాండ్ కరువు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గ్రేటర్‌ హైరదాబాద్ ఎన్నికలకు టైం దగ్గర పడుతున్నందున సిటీ ప్రెసిడెంట్‌ పోస్టు కోసం కాంగ్రెస్‌లో రేసు మొదలైంది. మేయర్‌ క్యాండిడేట్‌ కన్నా ప్రెసిడెంట్‌ పోస్టు కోసమే సిటీ లీడర్లు నువ్వా నేనా అంటున్నారు. వీళ్లలో ఒక్కొక్కరి కి ఒక్కో సీనియర్‌ లీడర్‌ సపోర్ట్‌‌‌‌ చేస్తూ గ్రూపులుగా విడిపోయారు. గ్రేటర్‌ హైదరాబాద్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌ పాలక మండలి టర్మ్‌ ఫిబ్రవరిలో ముగుస్తుంది. డిసెంబర్‌ నుంచి టర్మ్‌ ఎండింగ్‌ నాటికి ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చనని కాంగ్రెస్‌ నేతలు అంచనా వేస్తున్నారు. గ్రేటర్‌ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని ఈ మధ్యే పీసీసీ ముఖ్య నేతలు సమావేశమై నిర్ణయించారు. దాంతో గ్రేటర్‌ అధ్యక్ష పదవి, మేయర్‌ క్యాండిడేట్‌ అంశంపై పార్టీలో చర్చ జోరందుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్​ పార్టీ గ్రేటర్‌ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన కుమారుడు అనిల్‌‌‌‌ కుమార్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒకే కుటుంబానికి రెండు పదవులు ఎందుకనే చర్చ కాంగ్రెస్​లో మొదలైంది. దీనికి తోడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్‌‌‌‌ నియోజక వర్గం నుంచి అనిల్ కుమార్‌ టికెట్‌ దక్కించుకున్నారు. ఈ విషయంలో లోకల్ లీడర్లు కొందరు గుస్సాతో ఉన్నారు. సిటీలోని కొందరు సీనియర్​ నేతలకు, అంజన్ వర్గానికి పడటం లేదన్న ప్రచారం ఉంది. గ్రేటర్​ ఎన్నికలు వస్తున్నందున సిటీ ప్రెసిడెంట్‌ ను మారిస్తేనే పార్టీ ఉనికిని చాటుకుంటుందని, లేకపోతే కష్టమని లోకల్ లీడర్స్​ హెచ్చరించడం మొదలు పెట్టారు.

పోస్టు కోసం పోటాపోటీ

గత గ్రేటర్‌ ఎన్నికల్లో మేయర్‌ అభ్యర్థి గా అనౌన్స్‌‌‌‌ అయిన విక్రమ్ గౌడ్‌‌‌‌, మాజీ మేయర్‌ బండ కార్తీకతోపాటు ముషీరాబాద్‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌కు చెందిన కొందరు లీడర్లు పార్టీ సిటీ ప్రెసిడెంట్​ పోస్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం ఉంది. విక్రమ్ గౌడ్‌‌‌‌  మాజీ మంత్రి, దివంగత నేత ముఖేష్‌ గౌడ్‌‌‌‌ కుమారుడు కావడంతో పలువురు సీనియర్​ నేతల్లో సానుభూతి ఉంది. విక్రమ్ కు పదవి ఇస్తే ముఖేష్‌ కుటుంబాన్ని గౌరవించినట్లు ఉంటుందని వారు అంటున్నారు. విక్రమ్ కు పీసీసీ చీఫ్ ఉత్తమ్‌‌‌‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సపోర్టుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. మల్కాజ్‌ గిరి ఎంపీ, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి మాత్రం అంజన్‌ కుమార్‌ కే మద్దతు పలుకుతున్నట్లు ప్రచారంలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్‌‌‌‌ నియోజకవర్గంలో విక్రమ్‌‌‌‌ ఎలాంటి ప్రభావం చూపలేకపోయారని, నేతలందరినీ కలుపుకుపోయే సత్తా ఆయనకు లేదని కొందరు సీనియర్లతో పాటు సిటీ లీడర్లు అంటున్నారు. మేయర్‌ గా పని చేసిన కార్తీక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్‌‌‌‌ టికెట్‌ ఆశించి భంగపడ్డారు. తనకు సిటీ ప్రెసిడెంట్‌ గా అవకాశం కల్పించాలని కార్తీక ఆశిస్తున్నారు. ముషీరాబాద్‌‌‌‌ నేత నగేశ్ ముదిరాజ్‌ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ ఆశించి భంగపడ్డారు. పీసీసీ చీఫ్ కు సన్నిహితుడిగా పేరున్న ఆయన కూడా సిటీ ప్రెసిడెంట్‌ పోస్టు ఆశిస్తున్నారు.

మేయర్‌ అభ్యర్థిత్వానికి నో డిమాండ్‌‌‌‌

సాధారణంగా గ్రేటర్‌ ఎన్నికలు వస్తున్నాయంటే తమను మేయర్‌ క్యాండిడేట్​గా ప్రకటించాలని లీడర్లు సీనియర్​ నేతల చుట్టూ చక్కర్లు కొడుతారు. కానీ.. ఈసారి కాంగ్రెస్​లో అలాంటి ఊసే లేదు. మేయర్‌ అభ్యర్థిగా అనౌన్స్‌ అయితే కొందరు కార్పొరేటర్లనైనా గెలిపించుకోవాల్సి వస్తుందని, పార్టీ కోసం ఖర్చు పెట్టు కోవాల్సి వస్తుం దని భావించి చాలా మంది అందుకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది . గ్రేటర్‌ లో గెలుపుపై అనుమానంతోనే వాళ్లు ముందుకు రావడం లేదన్న చర్చ నడుస్తోంది . సిటీ ప్రెసిడెంట్‌ పోస్టులో ఉంటే డివిజన్‌ టికెట్లు ఇప్పించుకొని మైలేజీ పొందే అవకాశం దక్కుతుందని కొందరు భావిస్తున్నారు. కాగా, మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేయాలని ఆశపడ్డ పార్టీ ట్రెజరర్‌ గూడూరు నారాయణ రెడ్డి మాత్రం మేయర్‌ క్యాండిడేట్‌ గా తనను ప్రకటించాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌‌‌‌ సీటును టార్గెట్‌ గా పెట్టుకొని ఆయన ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.