హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్లో మే 14,15 తేదీల్లో గ్రీన్ సిమెంటెక్ 22వ ఎడిషన్ జరగనుంది. దీన్ని కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలోని గ్రీన్ బిజినెస్ సెంటర్ (సీఐఐ జీబీసీ), సిమెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ (సీఎంఏ) భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది.
ఈ రెండు రోజుల సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 400 మందికి పైగా పరిశ్రమ ప్రతినిధులు, 50 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ నిపుణులు హాజరుకానున్నారు. తక్కువ కార్బన్ సిమెంట్ తయారీలో సప్లిమెంటరీ సిమెంట్ మెటీరియల్స్ (ఎస్సీఎంల) పాత్ర, 'కార్బన్ క్యాప్చర్' టెక్నాలజీపై రెండు కీలక ప్రచురణలను విడుదల చేయనున్నారు.
డిజిటల్ పరిష్కారాలు, డీకార్బనైజేషన్ టెక్నాలజీలను ప్రదర్శించేందుకు 50 కి పైగా ఎగ్జిబిటర్లు ఇందులో పాల్గొంటారు. సిమెంట్ పరిశ్రమలో నెట్-జీరో స్ట్రాటజీలు, భవిష్యత్ టెక్నాలజీలపై సీనియర్ నాయకులతో ప్యానెల్ చర్చలు జరుగుతాయి.
