- సీఎం రేవంత్ కు గ్రూప్1 ఆఫీసర్స్ అసోసియేషన్ వినతి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో అనుభవమున్న గ్రూప్1 అధికారులతో రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. గురువారం సెక్రటేరియెట్ లో సీఎంను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రూప్1 అధికారులు కలిసి వినతిపత్రం ఇచ్చారు. స్థానిక సంస్థల్లో అనుభవం కలిగిన పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖల గ్రూప్1 అధికారులను లోకల్ బాడీ అదనపు కలెక్టర్లుగా నియమించాలని కోరారు.
పాలనా అనుభవం కలిగిన సీనియర్ గ్రూప్1 అధికారులను కార్పొరేషన్ ఎండీలుగా, డైరెక్టర్లుగా నియమించాలన్నారు. 2015లో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు ఏర్పాటుపై ఆరుగురు ఐఏఎస్ లతో కమిటీ ఏర్పాటు చేశారని, అయితే ఆ కమిటీ ఇప్పటి వరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించలేదని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. స్టేట్ సివిల్ సర్వీసు పరిధిలోకి అన్ని గ్రూప్1 పోస్టులను తీసుకురావాలని విన్నవించారు.
దీనికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని, అతి త్వరలోనే గ్రూప్1 అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తమకు హామీ ఇచ్చారని రాష్ట్ర అధ్యక్షుడు చంద్ర శేఖర్ గౌడ్ చెప్పారు. సీఎంను కలిసిన వారిలో అసోసియేషన్ ప్రతినిధులు హన్మంత్ నాయక్, శశికిరణా చారి, అరవింద్ రెడ్డి, వెంకట్, పద్మావతి, భరత్ రెడ్డి, ప్రశాంతి, మాధవ్, ఫణి గోపాల్, వినోద్, సోమ శేఖర్ తదితరులు ఉన్నారు.
