
టీమిండియాలో బౌలింగ్ చేసే బ్యాట్స్మన్ ఉంటే మేలు జరుగుతుందని టీ20 తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్య అన్నాడు. అందుకే జట్టులో మరిన్ని బౌలింగ్ ఆప్షన్స్ చూడాలనుకుంటున్నట్లు చెప్పాడు. న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20 తర్వాత మాట్లాడిన హార్దిక్ పాండ్యా..జట్టులోకి నిఖార్సైన ఆల్ రౌండర్లను తీసుకునే యోచనలో ఉన్నట్లు వెల్లడించాడు.
బౌలింగ్ ఆప్షన్స్ ఎక్కువగా ఉంటే బెటర్..
2024 టీ20 వరల్డ్ కప్కు ఇప్పటి నుంచి సన్నాహకాలు మొదలైనట్లు హార్దిక్ న్యూజిలాండ్ సిరీస్ కు ముందే చెప్పాడు. ఈ నేపథ్యంలో రెండో టీ20లో తనతో పాటు మరో ఇద్దరు ఆల్ రౌండర్లకు హార్దిక్ అవకాశం ఇచ్చాడు. దీపక్ హుడాతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్ చేయగలరు. ఇందులో భాగంగా జట్టులో ప్రతీసారి బౌలర్లే రాణించాలంటే కష్టమన్నాడు. అందుకే జట్టులో బౌలింగ్ చేయగల బ్యాట్స్ మన్ ఉండాలనుకుంటున్నట్లు హార్దిక్ చెప్పాడు. బౌలింగ్ చేయగల బ్యాటర్లు కావాలన్నాడు. ప్రొఫెషనల్ ఆల్ రౌండర్లను టీమ్ లోకి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం చేశాడు.
సూర్యపై ప్రశంసల జల్లు..
రెండో టీ20లో అద్భుత సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్పై కెప్టెన్ హార్దిక్ ప్రశంసల జల్లు కురిపించాడు. సూర్యకుమార్ యాదవ్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. తాము 170 నుంచి -175 పరుగులు చేయాలనుకున్నట్లు చెప్పాడు. కానీ సూర్య అద్భుత బ్యాటింగ్ కారణంగా 20 పరుగులు ఎక్కువ చేశామన్నాడు. అటు బౌలర్లు అద్భుతంగా రాణించారని మెచ్చుకున్నాడు. ప్రతీ బంతికి వికెట్ తీయకున్నా..అందరూ దూకుడుగా బౌలింగ్ చేశారని చెప్పాడు. న్యూజిలాండ్ లో పరిస్థితులు బౌలర్లకు ప్రతికూలంగానే ఉన్నా తమ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని తెలిపాడు.
ప్రతీ ఒక్కరికి అవకాశం దక్కదు..
ప్రస్తుతం టీమిండియాలో మంచి వాతావరణం ఉందని హార్దిక్ చెప్పాడు. ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు. ఇక లాస్ట్ టీ20లో ఎవరికి అవకాశం దక్కుతుందో తనకు తెలియదన్నాడు. అయితే అందరికి అవకాశం ఇవ్వాలని ఉన్నా..ఒక్కటే మ్యాచ్ మిగిలి ఉందన్నాడు. కాబట్టి అందరికి అవకాశం లభించకపోవచ్చని చెప్పాడు.