దర్యాప్తు కాదు.. ప్రతీకార దాడి : హరీశ్ రావు

 దర్యాప్తు కాదు.. ప్రతీకార దాడి : హరీశ్ రావు
  • నోటీసుల వెనుక రాజకీయ ప్రతీకారం, రేవంత్ అహంకారం: హరీశ్ రావు
  • ఇంటెలిజెన్స్​ వ్యవస్థంతా ఎర్రవల్లి చుట్టే ఉన్నా నందినగర్​లో గోడలకు నోటీసులా అని ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: సిట్ పేరుతో జరుగుతున్నది దర్యాప్తు కాదని.. ప్రతిపక్షనేతపై ప్రతీకార దాడి అని బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే హరీశ్​రావు ఆరోపించారు. నోటీసుల వెనుక చట్టం లేదని, కేవలం రాజకీయ ప్రతీకారం, రేవంత్​ రెడ్డి అహంకారమే ఉన్నాయని మండిపడ్డారు. కేసీఆర్​ను సిట్​విచారించిన నేపథ్యంలో ఆదివారం ఆయన ఎక్స్​లో స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సిట్​ఉల్లంఘించి నోటీసులు ఇచ్చిందన్నారు. నోటీసులు ఇచ్చేందుకు నిబంధనలేవీ పాటించలేదన్నారు.

కేసీఆర్​ ఎక్కడుంటున్నారో రాష్ట్రానికి తెలియదా అని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్​ వ్యవస్థ మొత్తం ఎర్రవల్లి చుట్టే ఉన్నా నందినగర్​లో గోడలకు నోటీసులు అంటించడం చౌకబారు రాజకీయానికి నిదర్శనమన్నారు. పదేండ్లు రాష్ట్రాన్ని నడింపించిన సీఎంకు కాంగ్రెస్​ ప్రభుత్వం ఇచ్చే మర్యాద ఇదేనా అని నిలదీశారు. చరిత్రను మలినం చేస్తున్నరు..

చరిత్రను సృష్టించింది కేసీఆర్​ అయితే.. ఆ చరిత్రను మలినం చేయాలని చూస్తున్న చరిత్రహీనుడు రేవంత్ రెడ్డి అని హరీశ్​ రావు మండిపడ్డారు. ఇది సిట్​కాదని, ఇది సీఎం ఇన్​స్ట్రక్షన్​ టీమ్​ (సీఐటీ) అని ఆరోపించారు. విదేశాల్లో ఉన్న సీఎం ఫోన్​ చేసి ఏది చెబితే ఇక్కడ అది పాటిస్తున్నారన్నారు. సిట్​ స్వతంత్రంగా పనిచేయడం లేదని, సీఎం ఆఫీసు నుంచి వచ్చే ఆదేశాలతోనే పనిచేస్తున్నదని విమర్శించారు. సిట్​ అంటే సిట్​..స్టాండ్​ అంటే స్టాండ్​ అనే రీతిలో వ్యవహరిస్తున్నారన్నారు. కేసీఆర్​ వస్తున్న దారిపొడవునా పోలీసులను మోహరించారన్నారు. బీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.