హరీశ్​.. రాజీనామాకు రెడీగా ఉండు : ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

హరీశ్​.. రాజీనామాకు రెడీగా ఉండు :  ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

హైదరాబాద్, వెలుగు: ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం రేవంత్​రెడ్డి ఆగస్టు 15లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తున్నారని, సవాల్​కు కట్టుబడి హరీశ్​రావు రాజీనామా లేఖతో రెడీగా ఉండాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. శనివారం అసెంబ్లీలోని సీఎల్పీ ఆఫీసులో మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరితో కలిసి కవ్వంపల్లి మీడియా సమావేశంలో మాట్లాడారు. కిరోసిన్ పోసుకొని అగ్గిపెట్టె దొరకని విధంగా హరీశ్​ మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ ఏ విధంగా చేసిందో రైతులకు తెలుసునన్నారు. కాంగ్రెస్ అంటేనే పేద, బడుగు, బలహీన వర్గాల పార్టీ అని, పేద ప్రజల కన్నీళ్లు తుడవడమే కాంగ్రెస్ విధానమన్నారు. రూ.7 లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్  రైతులకు, ఫామ్ హౌస్​ రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని, మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి వారికి రైతు బంధు అందిందని విమర్శించారు.  

జులై 2న మంత్రి వర్గ విస్తరణ 

జులై 2న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఉండబోతున్నదని ఎమ్మెల్యే కవ్వంపల్లి మీడియాతో చిట్ చాట్ లో చెప్పారు. మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పారు. బీఆర్ఎస్‌  కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్​లో చేరనున్నారని తెలిపారు. కాంగ్రెస్ మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి అన్నారు. అందులో భాగంగానే రుణమాఫీపై మంత్రి వర్గంలో తీర్మానం చేశారన్నారు. కాగా, కవ్వంపల్లి సత్యనారాయణ చేసిన ఈ కామెంట్స్ పై ఎమ్మెల్యే గంగుల కమలాకర్​ను వివరణ కోరగా.. తాను పార్టీ మారుతున్నానడం తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. కాంగ్రెస్ ఆడుతున్న  మైండ్ గేమ్​లో భాగమేనని ఆయన మండిపడ్డారు.