
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు త్వరలోనే బీజేపీలోకి వెళ్తారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. హరీశ్ ఎన్ని పోర్లు దండాలు పెట్టినా బీఆర్ఎస్ పగ్గాలు మాత్రం ఆయనకు ఇవ్వరని తెలిపారు. మంగళవారం సీఎల్పీ ఆఫీసులో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఐలయ్య మీడియాతో మాట్లాడారు. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారని చెప్పారు.
హరీశ్ రావు తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని ఫైర్ అయ్యారు. చిల్లర మాటలు మాట్లాడడం మానుకోకపోతే ఆయనను ప్రజలు ఉరికించి కొడ్తారని హెచ్చరించారు. తన పార్టీ మార్పుపై కేసీఆర్ కు అనుమానం వస్తుందనే భయంతోనే హరీశ్ ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..అసెంబ్లీ ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న బీఆర్ఎస్..ఎంపీ ఎన్నికల్లో మూడో స్థానానికి ఎందుకు దిగజారిందని ప్రశ్నించారు.
ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని బీఆర్ఎస్ నేతలే తమ కేడర్కి చెప్పింది నిజం కాదా అని నిలదీశారు. రేవంత్ నాయకత్వం బలపడుతుందనే భయంతోనే బీఆర్ఎస్.. బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్లల్లో బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలని సూచించారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, హరీశ్ రావు మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందన్నారు. అబద్ధాన్ని నిజమని నమ్మించడంలో హరీశ్ రావు
నేర్పరని విమర్శించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాతి నుంచి కేసీఆర్, కేటీఆర్ గయాబ్ అయ్యారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ పాలన కంటే తమ పాలన బాగుందని ప్రజలే చెబుతున్నారని లక్ష్మణ్ పేర్కొన్నారు.