కాంగ్రెస్-బీజేపీ కుట్రలో గవర్నర్ భాగస్వామ్యం కావడం దురదృష్టకరం: హరీష్ రావు

కాంగ్రెస్-బీజేపీ కుట్రలో గవర్నర్ భాగస్వామ్యం కావడం దురదృష్టకరం: హరీష్ రావు

కాంగ్రెస్, బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడిందన్నారు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయిందన్నారు.  బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి  గవర్నర్ తమిళిసై నిరాకరించారు... కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారని మండిపడ్డారు.

ఇది ద్వంద్వ నీతి కాదా ?.. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించడం కాదా? అని ఆయన ప్రశ్నించారు. గతంలో కూడా క్రీడా , సాంస్కృతిక , విద్యా సామాజిక , సేవ రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసిందని... అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదన్నారు. మరి.. ఇప్పుడు ఎందుకు ఆమోదించారు? అని అన్నారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ , బీజేపీ రెండు పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ ను అనగదొక్కాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమన్నారు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలని... కానీ బీఆర్ఎస్ కు, కాంగ్రెస్ కు తేడా చూపిస్తున్నారని హరీష్ రావు అన్నారు.