
హైదరాబాద్, వెలుగు: వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. విద్యుత్ కోతలకు, హరీశ్రావుకు సంబంధం ఉందని రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ మేరకు బుధవారం ట్వీట్ చేశారు. కరెంట్ కోతల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద రేవంత్ అభాండాలు వేస్తున్నాడని పేర్కొన్నారు.
విద్యుత్ రంగ వైఫల్యాలకు తాను బాధ్యుడిని అన్నట్టుగా సీఎం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన వైఖరి ‘ఆడ రాక పాత గజ్జెలు’ అనే సామెతను గుర్తు చేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు, విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్టమైన వ్యవస్థను నిర్మించిందన్నారు. రెప్పపాటు కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపిందని హరీశ్ అన్నారు. కేవలం ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్ప కూల్చిందని ఆరోపించారు. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ను సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతిపక్షాలపై ఆరోపణలు మానుకుని, పాలనపై దృష్టి పెడితే మంచిదని రేవంత్రెడ్డికి సూచించారు.