మాట నిలబెట్టుకున్న కేసీఆర్.. సీఎంకు హరీశ్ థ్యాంక్స్

మాట నిలబెట్టుకున్న కేసీఆర్..   సీఎంకు హరీశ్ థ్యాంక్స్

హైదరాబాద్, వెలుగు: లక్ష రూపాయల లోపు రైతు రుణాలు మాఫీ చేసి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని మంత్రి హరీశ్​రావు అన్నారు. కేంద్రం ఎన్ని ఆర్థిక అడ్డంకులు సృష్టించినా, కరోనా వంటి కష్టాలు ఎదురైనా రైతు సంక్షేమం విషయంలో రాజీ పడలేదన్నారు. రూ.99,999 వరకు ఉన్న క్రాప్​లోన్ల మాఫీ కోసం ఆర్థిక శాఖ రూ.5,809.78 కోట్లు విడుదల చేసిన నేపథ్యంలో హరీశ్​రావు సోమవారం ట్విట్టర్ ద్వారా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. 

‘‘ఒకే రోజు 9,02,843 మంది రైతుల లోన్లు మాఫీ చేసి తెలంగాణ సర్కార్ రికార్డు నెలకొల్పింది. దరఖాస్తు చేసుకునే అవసరం లేకుండా, లైన్ లో నిల్చునే అవస్థ లేకుండా, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, రూపాయి అవినీతికి తావు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయడం దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే సాధ్యమవుతోంది. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను  సీఎం కేసీఆర్ నిరాటంకంగా కొనసాగిస్తున్నరు. 

ఇప్పుడు అదే రీతిగా రుణ మాఫీ చేసి రైతు కుటుంబాల్లో ఆనందం నింపారు. ఆయన రైతుల పక్షపాతి అని చెప్పేందుకు దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ పథకాలు, విధానాలే నిదర్శనం” అని ట్వీట్​చేశారు.