హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ను ఖండిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఇతర నాయకులతో కలిసి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ను, కేసీఆర్ను డీమోరలైజ్ చేసే కుట్రలో భాగంగానే కవితను అరెస్ట్ చేశారని ఆరోపించారు.
ఈ కుట్రలో బీజేపీ, కాంగ్రెస్ భాగస్వామ్యం ఉందన్నారు. కవిత అరెస్ట్ అక్రమం, అనైతికం, అప్రజాస్వామికం అని ఖండించారు. కుట్రలో భాగంగానే ఈడీ అధికారులు శుక్రవారం మధ్యాహ్నం తర్వాత కవిత ఇంటికి వచ్చారన్నారు. కవితను అరెస్ట్ చేయాలని ముందే ఫిక్స్ అయ్యి వచ్చారని, అందుకే రిటర్న్ ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకున్నారన్నారు.
కాగా, మహిళలను ఈడీ అరెస్ట్ చేయొచ్చా లేదా అనే అంశంపై సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ విచారణలో ఉండగా, ఆమెను అరెస్ట్ చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. కుట్రలో భాగంగానే శుక్రవారం సాయంత్రం కవితను ఈడీ అరెస్ట్ చేసిందని విమర్శించారు.