హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)లో అవినీతిని ప్రశ్నించి పాపానికి స్టార్ క్రికెటర్ అంబటి రాయుడు మూల్యం చెల్లించుకోనున్నాడు. హెచ్సీఏ మొత్తం అవినీతిలో మునిగిందని, టీమ్ సెలెక్షన్స్ను డబ్బు, రాజకీయం ప్రభావితం చేస్తూ.. జట్టును దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన రాయుడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు సంఘం అపెక్స్ కౌన్సిల్ రెడీ అవుతోంది. ‘హెచ్సీఏ ప్రతిష్ఠ దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు రాయుడిపై చర్యలు తీసుకుంటాం. ఈ విషయంలో రూల్ బుక్, బైలాస్ ప్రకారం ముందుకెళ్తాం. మొదటగా ఈ విషయంపై దర్యాప్తు చేయాలని సీఈఓను కొరుతాం. రిపోర్టు వచ్చిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ తగిన చర్యలు తీసుకుంటుంది’అని హెచ్సీఏ సెక్రెటరీ ఆర్. విజయానంద్ తెలిపారు. వచ్చేనెల ఆరో తేదీన ఉప్పల్లో ఇండియా-, వెస్టిండీస్ మధ్య జరిగే తొలి టీ20 ఏర్పాట్లలో తామంతా బిజీగా ఉన్నామని, మ్యాచ్ ముగిసిన తర్వాత రాయుడి ‘విషయం’ తేల్చుతామని అన్నారు.
అయితే, అవినీతిని అరికట్టకుండా… దాన్ని ప్రశ్నించిన రాయుడిని ముద్దాయిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న హెచ్సీఏ పెద్దలకు మాజీ క్రికెటర్లు, ఆఫీస్ బేరర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ‘అంబటిపై చర్యలు ఎందుకు తీసుకోవాలి? అతను చేసిన తప్పేంటి? అతనేమైనా అవినీతికి పాల్పడ్డాడా? హెచ్సీఏలో ఏం జరుగుతుందో బయటికి మాట్లాడాడు. అతను చెప్పిందంతా నిజమే’అని హైదరాబాద్ మాజీ ఆఫ్ స్పిన్నర్ కవల్జీత్ సింగ్ అన్నాడు. హెచ్సీఏ మాజీ సెక్రెటరీ ఎస్. వెంకటేశ్వరన్ కూడా రాయుడుకు మద్దతు పలికాడు. ‘అంబటిపై చర్యలు తీసుకోవాలనడం సమంజసం కాదు. టీమ్ సెలెక్షన్స్లో ఏ స్థాయిలో అవినీతి జరుగుతుందో అందరికీ తెలుసు. గత ఏడాది నుంచి పరిస్థితులు చాలా అధ్వాన్నంగా మారాయి. టాలెంట్ కంటే డబ్బుకే విలువ ఇస్తున్నారు’ అని చెప్పుకొచ్చాడు. రాయుడు చెప్పేదంతా సత్యమని, దాన్ని తొక్కిపెట్టాలని ప్రయత్నించకూడదని మాజీ వైస్ ప్రెసిడెంట్ ప్రకాశ్ చంద్ జైన్ అన్నారు. ఒక కెప్టెన్ ఆరోపణలు చేసినప్పుడు.. అధికారులు ఆ విషయాన్ని పరిశీలించాలని చెప్పారు. ఒక సక్సెస్ఫుల్ క్రికెటర్ అయిన రాయుడును ‘ఫ్రస్టేటెడ్ క్రికెటర్’అని ఎలా అంటారని మాజీ సెక్రెటరీ శేష్ నారాయణ్ ప్రశ్నించారు.