అమెరికా వెళ్దామన్నందుకు భార్యను చంపేసిండు

అమెరికా వెళ్దామన్నందుకు భార్యను చంపేసిండు

తర్వాత ఆత్మహత్య చేసుకున్న భర్త

తల్లాడ, వెలుగు: అమెరికా వెళ్లాలని భార్య పట్టుబట్టడంతో క్షణికావేశంలో ఆమెను చంపి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రంగం బంజర్ గ్రామానికి చెందిన సంక్రాంతి  సుబ్రమణ్యేశ్వరరావు, విజయలక్ష్మి  దంపతులు వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వారికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు రామగుండంలో, చిన్న కూతురు అమెరికాలో స్థిరపడ్డారు.  రెండేళ్ల క్రితం చిన్న కూతురు వద్దకు అమెరికా వెళ్లి ఆరునెలల పాటు ఉన్నారు. మళ్లీ ఈ నెల 15న అమెరికా రావాలంటూ కూతురు టిక్కెట్లు బుక్​ చేసింది.

అమెరికా వెళ్లేందుకు ఇష్టపడని సుబ్రమణ్యేశ్వరరావు (65) భార్య విజయలక్ష్మి(60) తో ఘర్షణ పడ్డాడు. క్షణికావేశంలో మంగళవారం రాత్రి భార్యను కత్తితో  పొడిచి హతమార్చాడు.  తర్వాత తానూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం పాలు పోసేందుకు వచ్చిన పాల వ్యాపారి  ఇంట్లో రక్తపు మడుగులో ఉన్న మృతదేహాలను చూసి స్థానికులకు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వసంత్​కుమార్​ చెప్పారు.