రేపు కవిత పిటిషన్​పై విచారణ

రేపు కవిత పిటిషన్​పై విచారణ
  •      ఈడీ అరెస్ట్​ను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో ఈడీ, ట్రయల్ కోర్టు కస్టడీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ శుక్రవారం సుప్రీం కోర్టులో విచారణకు రానున్నది. ఈ పిటిషన్​ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం.త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించనున్నది. ఈ మేరకు సుప్రీం కోర్టు విచారణ జాబితాలో కవిత పిటిషన్ చేర్చింది. తన అరెస్ట్ అక్రమమని, కస్టడీ రాజ్యాంగ విరుద్ధం అంటూ సోమవారం 537 పేజీలతో కవిత పిటిషన్ దాఖలు చేశారు.

 గతంలో సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్, దానిపై విచారణ, కోర్టు ఉత్తర్వుల కాపీలు, మీడియా పబ్లిష్ చేసిన కథనాలను కవిత జత చేశారు. కేంద్రం చేతిలో ఈడీ కీలుబొమ్మగా మారిందని, పొలిటికల్ ఎజెండాతో ఈడీ అధికారులు పని చేస్తున్నారని తన పిటిషన్ లో కవిత ఆరోపించారు. చట్టవ్యతిరేకంగా, కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. 

ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి కేసు తనపై లేదన్న అంశాలను పరిగణలోకి తీసుకోవాలని పిటిషన్ లో ప్రస్తావించారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని తాజా పిటిషన్ పై తుది తీర్పు వెలువడే వరకు తక్షణమే తనను విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. అలాగే, ప్రస్తుత అరెస్ట్ పై స్టే విధిస్తూ.. ట్రయల్ కోర్టు ఉత్తర్వులను పక్కనపెట్టాలని విజ్ఞప్తి చేశారు.