
- జూన్ క్వార్టర్లో దేశంలోని టాప్ 7 సిటీలలో 178 లక్షల చదరపు అడుగులకు చేరిన లీజింగ్
- ఏడాది లెక్కన 11 శాతం పెరుగుదల
- హైదరాబాద్లో లీజుకిచ్చిన ఆఫీస్ స్పేస్ 32 లక్షల చదరపు అడుగులు
- కిందటేడాది జూన్ క్వార్టర్తో పోలిస్తే 23 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఏప్రిల్–-జూన్ క్వార్టర్ (క్యూ1) లో ఏడు పెద్ద నగరాల్లో ఆఫీస్ స్పేస్ లీజింగ్ 178 లక్షల చదరపు అడుగులకు చేరుకుందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కంపెనీ కోలియర్స్ పేర్కొంది. కిందటేడాది జూన్ క్వార్టర్తో పోలిస్తే 11 శాతం పెరిగిందని, గ్లోబల్గా ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ కార్పొరేట్ కంపెనీల నుంచి డిమాండ్ బాగుందని తెలిపింది.
ఈ రిపోర్ట్ ప్రకారం, గత ఏడాది జూన్ క్వార్టర్ నాటికి ఈ ఏడు నగరాల్లో లీజింగ్ 161 లక్షల చదరపు అడుగులుగా ఉంది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ- ఎన్సీఆర్, హైదరాబాద్, కోల్కతా, పుణెలలో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ బాగుంది. కానీ ముంబైలో మాత్రం లీజింగ్ తగ్గింది. పైన పేర్కొన్న లీజింగ్ స్పేస్లో లీజ్ రెన్యూవల్స్, ప్రీ బుకింగ్స్, లేదా లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైన్ చేసిన డీల్స్ లేవు.
కోలియర్స్ ఇండియా ఎండీ అర్పిత్ మెహ్రోత్రా మాట్లాడుతూ, “ భారత ఆఫీస్ మార్కెట్ గత రెండేళ్ల ఊపును కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా వృద్ధి చెందుతోంది. వివిధ రకాల కంపెనీల నుంచి డిమాండ్, నిలకడైన సప్లయ్, ఇన్వెస్టర్ల ఆసక్తి వల్ల కమర్షియల్ రియల్ ఎస్టేట్కు 2025 కూడా మరో గొప్ప ఏడాది కానుంది” అని అన్నారు.
సిటీల వారీగా లీజింగ్..
- హైదరాబాద్: ఈ సిటీలో ఆఫీస్ స్పేస్ లీజింగ్ జూన్ క్వార్టర్లో 23 శాతం వృద్ధి చెందింది. 32 లక్షల చదరపు అడుగుల (గత ఏడాది 26 లక్షలు) కు ఎగిసింది.
- బెంగళూరు: ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్లో లీజింగ్ 48 లక్షల చదరపు అడుగులు వద్ద ఫ్లాట్గా ఉంది. గత ఏడాది కూడా ఇదే స్థాయిలో ఉంది.
- చెన్నై: కిందటేడాదితో పోలిస్తే డిమాండ్ 30శాతం పెరిగి 26 లక్షల చదరపు అడుగులు అయింది (గత ఏడాది 20 లక్షలు).
- ఢిల్లీ- ఎన్సీఆర్: లీజింగ్ 16శాతం వృద్ధి చెంది 19 లక్షల చదరపు అడుగుల నుంచి 22 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది.
- కోల్కతా: డిమాండ్ రెట్టింపు అయి 6 లక్షల చదరపు అడుగులుగా (గత ఏడాది 3 లక్షలు) ఉంది.
- పుణె: లీజింగ్ 60శాతం పెరిగి 10 లక్షల చదరపు అడుగుల నుంచి 16 లక్షల చదరపు అడుగులు అయింది.
- ముంబై: ముంబైలో మాత్రం లీజింగ్ 20శాతం తగ్గి 28 లక్షల చదరపు అడుగులకు (గత ఏడాది 35 లక్షలు) దిగొచ్చింది.
మొత్తం 178 లక్షల చదరపు అడుగుల లీజింగ్లో, 135 లక్షల చదరపు అడుగులను కార్పొరేట్ కంపెనీలు నేరుగా తీసుకున్నాయి. 43 లక్షల చదరపు అడుగులను కో-వర్కింగ్ ఆపరేటర్లు తీసుకుని ఇతరులకు సబ్-లీజ్ ఇచ్చారు. అర్బన్ వాల్ట్ ఫౌండర్, సీఈఓ అమల్ మిశ్రా మాట్లాడుతూ, “ ఆపరేటింగ్ ఖర్చులు, సౌకర్యాల పెరుగుదల వల్ల ఆఫీస్ స్పేస్ డిమాండ్ ఊపు అందుకుంటోంది” అని అన్నారు. “విదేశీ కంపెనీలు గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీల)ను ఏర్పాటు చేస్తుండడం పెరిగింది. దీంతో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ బలంగా ఉంది” అని హాంటో వర్క్స్పేస్ ఫౌండర్ ఆశిత్ వర్మ పేర్కొన్నారు.