తమిళనాడు అతలాకుతలం... జనజీవనం అస్తవ్యస్తం... రైల్వేస్టేషన్లు, ఎయిర్​పోర్టుల్లో వరద నీరు

తమిళనాడు అతలాకుతలం...  జనజీవనం అస్తవ్యస్తం... రైల్వేస్టేషన్లు, ఎయిర్​పోర్టుల్లో  వరద నీరు

తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. ఫలితంగా ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి. దాంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ వానలతో దక్షిణ తమిళనాడుకు చెందిన తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి, కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి... ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. విమానాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. అవసరమైతే ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి సిద్ధంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్లను స్టాలిన్‌ ఆదేశించారు..

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం ( డిసెంబర్​ 18) ఉదయం తమిళనాడులోని దక్షిణ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి మరియు కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీ వర్షానికి రహదారులన్నీ జలమయంగా మారడంతో జనజీవనం స్తంభించిపోయింది. ఈ జిల్లాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు బ్యాంకులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రైవేటు రంగ సంస్థల కార్యకలాపాలు నిలిచిపోయాయి. మరోవైపు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని రైల్వే స్టేషన్లలోకి నీరు చేరి సిగ్నల్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది.  కోయంబత్తూరు ఎయిర్​ పోర్ట్​లోకి భారీగా వరదనీరు చేరింది.

తూత్తుకుడి జిల్లాలోని తిరుచెందూర్, సత్తాంకుళం స్టేషన్లలో గడిచిన 24 గంటల్లో 606 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. తిరునల్వేలిలోని పాలయంకోట్టై స్టేషన్‌లో 260 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తమిళనాడు వ్యాప్తంగా మరో రెండు రోజులు ( డిసెంబర్​ 19,20)  అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాబోయే( డిసెంబర్​ 18 నుంచి) ఏడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతాయని హెచ్చరిక జారీ చేసింది. మధురై, విరుదునగర్, తేని జిల్లాల్లోని కొన్ని చోట్ల ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. తూత్తుకుడి, దిండిగల్, కోయంబత్తూర్ మరియు తిరుప్పూర్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

వరద తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాముల నుంచి నీటిని వదలడంతో.. తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరింది. ఈ వరదలకు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం భారీ స్థాయిలో ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు బలగాలను తమిళనాడులో మోహరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. ఈ నెల ప్రారంభంలో మిగ్‌జాం తుపాను ప్రభావంతో తమిళనాడు అతలాకుతలమైంది. దాని నుంచి కోలుకుంటున్న సమయంలో మళ్లీ భారీ వర్షాలు తమిళనాడును ముంచెత్తుతున్నాయి.