40 మంది సైనికులపై.. పోలీస్ స్టేషన్ లో కేసు

40 మంది సైనికులపై.. పోలీస్ స్టేషన్ లో కేసు

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో పోలీసులపై దాడి,  పోలీస్ స్టేషన్‌ ధ్వంసం ఆరోపణలతో  కమాండింగ్ ఆఫీసర్,  మేజర్‌తో సహా నలభై మంది ఆర్మీ సిబ్బందిపై పోలీసు కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. 

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా అథోలి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి, పోలీసు సిబ్బంది,ప్రభుత్వ అధికారులపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై 17 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఎన్. అరుణ్ గాంధీ, మేజర్ వికాస్ శర్మ సహా 40 మంది ఆర్మీ సిబ్బందిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం అభియోగాలతో కేసు పెట్టారు. ఆర్మీ సిబ్బంది లాఠీలు, ఇనుప రాడ్లు, ఆయుధాలతో పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించి పలువురు పోలీసులను గాయపరిచారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 

►ALSO READ | పాస్‌పోర్ట్, ఆధార్ ఉన్నంత మాత్రాన మీరు భారత పౌరులు కాదా? అసలు పౌరసత్వాన్ని నిరూపించే పత్రాలేవి?

అథోలి ఎస్‌డిపిఓ విజయ్ కుమార్ భగత్, ఎస్‌హెచ్‌ఓ అమృత్ కటోచ్‌పై కూడా దాడి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఆర్మీ వాహనాన్ని ఏఆర్టీఓ స్వాధీనం చేసుకోవడం తలెత్తిన వివాద ఘటన అనంతరం ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తుకు పూర్తి సహకారం అందిస్తామని భారత సైన్యం వెల్లడించింది.