భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం

భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం
  • భారీ వర్షాలతో గుజరాత్ అతలాకుతలం
  • అహ్మదాబాద్, సూరత్  సహా పలు జిల్లాల్లో స్తంభించిన జనజీవనం
  • పాల్సానా తాలూకాలో 15.3 సెం.మీ వర్షపాతం
  • చాలా చోట్ల రోడ్లపై వరద
  • విరిగిపడిన చెట్లు.. ట్రాఫిక్  జామ్

అహ్మదాబాద్: భారీ వర్షాలతో గుజరాత్  అతలాకుతలమైంది. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొట్టాయి. అహ్మదాబాద్, సూరత్  సహా పలు జిల్లాల్లో జనజీవనం స్తంభించిపోయింది. సూరత్  జిల్లాలోని పాల్సానా తాలూకాలో పది గంటల్లోనే 15.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు సూరత్, భుజ్, వాపి, భరూచ్, అహ్మదాబాద్  నగరాల్లో ట్రాఫిక్  స్తంభించిపోయింది. ఆ నగరాల్లోని అండర్ పాస్ తో పాటు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరడంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. 43 తాలూకాల్లో 4 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వర్షం కురిసింది. ఇక బర్దోలీలో 13.5,  సూరత్  సిటీలో 12.3, కామ్రేజ్ లో 11.9, సూరత్  జిల్లాలోని మహువాలో కేవలం పది గంటల్లోనే 11.9 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది. అలాగే వల్సాద్  జిల్లాలోని వాపిలో 11.7, కప్రాడాలో 9, ధర్మాపూర్ లో 7.3, సూరత్  జిల్లాలోని ఓల్పాడ్ లో 11.6, వల్సాద్  తాలూకాలో 10.2, నవ్ సారీ జిల్లాలోని ఖేర్గాంలో 8, భరూచ్  తాలూకాలో 8.6, మోర్బీ తాలూకాలో 7.2  సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక అహ్మదాబాద్  సిటీలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. దీంతో ఈ నగరంలోని చాలా ప్రాంతాల్లో నీరు చేరి స్థానికులు ఇబ్బందిపడ్డారు. మరో నాలుగు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 

అహ్మదాబాద్ లో కుంగిన రోడ్డు

భారీ వర్షాలకు అహ్మదాబాద్ లోని షేలా ఏరియాలో ఓ రోడ్డు కుంగిపోయింది. దీంతో రోడ్డు మధ్య భాగంలో భారీ గొయ్యి ఏర్పడి ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. చుట్టుపక్కల వర్షపు నీళ్లన్నీ కుంగిపోయిన రోడ్డులో చేరాయి. కాగా.. రోడ్డు కుంగిపోవడంపై కేరళ కాంగ్రెస్  యూనిట్.. గుజరాత్  బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. ‘‘అహ్మదాబాద్  సిటీలో ఇటీవలే వర్షపు నీటిని ఒడిసిపట్టే కార్యక్రమం చేపట్టారు. ఎంతగా అంటే ఒక్క చుక్క వర్షపు నీరు కూడా అరేబియా సముద్రంలో చేరనంతగా” అని కేరళ కాంగ్రెస్  ఎద్దేవా చేసింది. రోడ్డు కుంగిపోయిన ఫొటోను సోషల్  మీడియాలో అప్ లోడ్  చేసింది.