తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్: హైద‌రాబాద్ న‌గ‌రంతో పాటు రాష్ట్ర వ్యా ప్తంగా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది అప్రమ‌త్తంగా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పురాత‌న ఇళ్లలో ఉన్న వారిని ఖాళీ చేయించి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించారు. వినాయ‌క మండ‌పాల స‌మీపంలో ఉన్న విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లతో భ‌క్తుల‌కు ప్రమాదం వాటిల్లకుండా త‌గు జాగ్రత్తలు తీసుకోవాల‌ని ట్రాన్స్‌కో సిబ్బందిని ఆదేశించారు.

హైద‌రాబాద్‌లో హైడ్రా, జీహెచ్ఎంసీ, ఎస్డీఆర్ఎఫ్‌, అగ్నిమాప‌క‌, పోలీసు సిబ్బంది స‌మ‌న్వయం చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు త‌లెత్తకుండా చూడాల‌ని చెప్పారు. న‌దులు, వాగులపై ఉన్న లోత‌ట్టు కాజ్‌వేలు, క‌ల్వర్టుల‌పై నుంచి నీటి ప్రవాహాలు ఉంటే అక్కడ రాక‌పోక‌లు నిషేధించాల‌ని ఆదేశించారు. చెరువులు, కుంటలకు గండి ప‌డే ప్రమాదం ఉన్నందున నీటి పారుద‌ల శాఖ అధికారులు ముందు జాగ్రత్త చ‌ర్యలు తీసుకోవాల‌న్నారు.

అంటువ్యాధులు ప్రబ‌లే ప్రమాదం ఉన్నందున న‌గ‌ర పాల‌క‌, పుర‌పాల‌క‌, గ్రామ పంచాయ‌తీ పారిశుద్ధ్య సిబ్బంది అప్రమ‌త్తంగా ఉండి నిల్వ నీటిని తొలగించ‌డంతో పాటు ఎప్పటిక‌ప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది ఆసుప‌త్రుల్లో స‌రిప‌డా మందులు అందుబాటులో ఉంచుకోవ‌డంతో పాటు అవ‌స‌ర‌మైన చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల‌ని సూచించారు.