రాష్ట్రానికి భారీ వర్ష సూచన..

రాష్ట్రానికి భారీ వర్ష సూచన..

రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. నిన్న కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్, ఉమ్మడి కరీంనగర్, నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల వాగులు ఉప్పొంగి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వైపు రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్,  ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ వరంగల్, మెదక్, జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరించారు. 

గత 24 గంటల్లో రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా నాయకల్ ల 9.16 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా నాగారెడ్డి పేటలో 7.8సెం.మీ, కరీంనగర్ జిల్లా గన్నేరు వరంలో 7.18 సెంటీమీటర్ల వాన పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా మూట కొండూరు ప్రాంతంలో 6.9, నిర్మల్ జిల్లా పెంబిలో 6.43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. సిటీలో కురిసిన భారీ వర్షానికి ముకరంపుర, రాంనగర్, విద్యానగర్, జ్యోతినగర్, కట్టరాంపూర్ ప్రాంతాలు నీటమునిగాయి. శాతవాహన యూనివర్సిటీ రోడ్డుపై భారీగా నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. LMD గేట్లు ఎత్తారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్టులు జారీ చేశారు.

సిద్దిపేటలో ఏకధాటిగా 3గంటలపాటు వర్షం పడింది. పాత బస్టాండ్, భరత్ నగర్, మెదక్ రోడ్డు, హైదరాబాద్ రోడ్లు నీట మునిగాయి. పాత బస్టాండులో రెండు ఫీట్ల మేర నీరు నిలిచింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ, ఇల్లందు, సుజాతానగర్, ములకలపల్లి ప్రాంతాల్లో వర్షాలు దంచికొట్టాయి.  

నారాయణ పేట జిల్లా మక్తల్ లో భారీ వర్షాలకు గొల్లపల్లి ,మంథన్ గోడ్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో మంథన్ గోడ్-మక్తల్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో దుంధుబి, దెయ్యాల, ఉడుముల వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలోని బతుకమ్మ వాగులో 30 మంది రైతులు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఇక రాష్ట్రంలో పిడుగులు పడి ఇద్దరు చనిపోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెట్రాం చెలక స్టేజి దగ్గర పిడుగు పడి వసంతరావు అనే రైతు చనిపోయారు. రాజన్న సిరిసిల్లా జిల్లా మూడపల్లిలో పిడుగుపాటుకు ఓ మహిళ మృతి చెందగా.. కామారెడ్డి జిల్లా పోతాయి పల్లిలో పిడుగు పడి 20 మేకలు చనిపోయాయి. కరీంనగర్ జిల్లా యాదవుల పల్లెలో బర్రె, దూడ మృతి చెందాయి.