హీరో మోటో కార్ప్​ షేర్లు పడ్డాయ్​

హీరో మోటో కార్ప్​ షేర్లు పడ్డాయ్​

న్యూఢిల్లీ: కంపెనీ ఎగ్జిక్యూటివ్​ చైర్​పర్సన్​ పవన్​కాంత్​ ముంజాల్​ సహా ఇతరులపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ఈడీ) సోదాలు జరపడంతో హీరో మోటోకార్ప్​ షేర్లు మంగళవారం సెషన్లో 3 శాతం పతనమయ్యాయి. ఈ టూ వీలర్​ కంపెనీ షేర్లు బీఎస్​ఈలో రూ. 3,103 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో హీరో మోటోకార్ప్​ షేరు 5.34 శాతం మేర పడిపోయింది. ఫలితంగా కంపెనీ మార్కెట్​ వాల్యూ రూ. 2,007 కోట్లు తగ్గి రూ. 62,011 కోట్లకు చేరింది. 

పవన్​కాంత్​ ముంజాల్​ ఇల్లు, ఆఫీసులలో ఈడీ సోదాలు జరిపింది. మనీలాండరింగ్​ ఆరోపణల దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు చేపట్టారు. పీఎంఎల్​ఏ కింద కేసు రిజిస్టర్​ చేశాక దాడులు నిర్వహించినట్లు ఈడీ వర్గాలు వెల్లడించాయి. ఈడీ అధికారులు తమ రెండు ఆఫీసులను, పవన్​ముంజాల్​ఇంటినీ సోదా చేసినట్లు హీరో మోటోకార్ప్​ ధృవీకరించింది. ఈడీ అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నట్లు పేర్కొంది. ఇండియా సహా 40 దేశాలలో హీరో మోటోకార్ప్​ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.