హీరోయిన్గా ఇండస్ట్రీకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉంది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ‘సత్యభామ’ అనే చిత్రంతో పాటు కమల్ హాసన్ ‘భారతీయుడు 2’లో నటిస్తున్న ఆమె.. తాజాగా ఓ కొత్త సినిమాకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ ఇప్పటికే కీలకపాత్రలు పోషిస్తుండగా, కాజల్ కూడా ఈ వరుసలో చేరనుందట.
ఇటీవలే అక్షయ్ కుమార్ ఈ మూవీ షూట్లో జాయిన్ అయ్యారు. ఆయన ఇందులో శివుడిగా నటిస్తున్నారు. పార్వతి పాత్రలో కాజల్ అగర్వాల్ కనిపించనున్నట్టు తెలుస్తోంది. నయనతార, అనుష్క లాంటి పలువురు హీరోయిన్స్ పేర్లు ఈ పాత్రకు పరిశీలనకు వచ్చాయి. ఫైనల్గా ఆ అవకాశం కాజల్ను వరించిందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజానిజాలేంటో తెలియాల్సి ఉంది. ‘మోసగాళ్లు’ చిత్రంలో మంచు విష్ణు, కాజల్ బ్రదర్ అండ్ సిస్టర్గా నటించిన విషయం తెలిసిందే.