
హీరోయిన్ శ్రియ భర్త ఆండ్రీ కరోనా లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ విషయాన్ని శ్రియ మీడియాకు తెలిపారు. ఆండ్రీకి పొడిదగ్గు, జ్వరం ఉందని శ్రియ చెప్పారు. ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి స్పెయిన్లో ఉంటున్నారు. కరోనా ఎక్కువగా వ్యాపించిన దేశాలలో స్పెయిన్ రెండవ స్థానంలో ఉంది. దీంతో ఆ దేశంలో కూడా లాక్ డౌన్ ను విధించారు. అప్పటినుంచి తాము ఇంట్లోనే గడుపుతున్నట్లు చెప్పింది శ్రియ. కొన్ని రోజులుగా క్వారంటైన్ లో ఉంటున్న వీడియోలను, ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. 2018లో ఆండ్రీని శ్రియ వివాహం చేసుకున్నారు.
మూడు రోజుల క్రితం తన భర్త ఆండ్రీకి కరోనా లక్షణాలు కనపడడంతో హాస్పిటల్కు వెళ్లి చెక్ చేయించుకున్నామని .. ఆండ్రీని పరిక్షించిన డాక్టర్లు… కరోనా పాజిటీవ్గా నమోదు కాలేదని చెప్పినట్లు తెలిపింది. అయితే డాక్టర్ల సూచన ప్రకారం ఆండ్రీ ఇంట్లోనే ప్రత్యేక గదిలో ఉంటున్నాడని… డాక్టర్లు ఇంటికి వచ్చి రోజూ పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ప్రస్తుతం తన భర్త ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పింది.
స్పెయిన్లో కరోనా వేగంగా వ్యాపిస్తుంది. అక్కడ ఇప్పటి వరకు 1లక్షా 70వేల మందికి కరోనా వైరస్ సోకింది. ఇది కరోనా సోకిన కేసులలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండగా… 18వేలకు పైగా మరణించారు.