హైదరాబాద్, వెలుగు: వాటాల బదలాయింపునకు సంబంధించిన రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (రాకియా)తో వివాదంపై పయనీర్ అల్యూమినియం ఇండస్ట్రీస్ లిమిటెడ్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు బుధవారం కొట్టివేసింది. వాటాల విక్రయాలకు సంబంధించిన ఒప్పందాలను కొనసాగించరాదంటూ రాకియా వాణిజ్య కోర్టులో సూట్ దాఖలు చేసింది.
రెండు కంపెనీల మధ్య వివాదం ఉన్నప్పుడు మధ్యవర్తిత్వం లేకుండా సివిల్ కోర్టులో నేరుగా సూట్ వేయడానికి వీల్లేదంటూ పయనీర్ అల్యూమినియం కంపెనీ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్ మౌసమీ భట్టాచార్య, జస్టిస్ గాడి ప్రవీణ్కుమార్లధర్మాసనం విచారణ చేపట్టి, తీర్పు ఇచ్చింది. రాకియా హక్కుల కోసం సూట్ దాఖలు చేసిందని పేర్కొంది. వాణిజ్య కోర్టుల చట్టంలోని సెక్షన్ 12ఎ ప్రకారం మధ్యవర్తిత్వం తప్పనిసరన్న వాదన ఈ సూట్ విచారణను అడ్డుకోవడానికేనని వ్యాఖ్యానిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.
