సివిల్ వివాదాల్లో మీ జోక్యం ఎందుకు..? పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

సివిల్ వివాదాల్లో మీ జోక్యం ఎందుకు..? పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం

హైదరాబాద్: సివిల్‌ వివాదాల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు మరోసారి సీరియస్‌ అయ్యింది. ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసుల తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో పోలీసులపై 30 పిటిషన్‌లు దాఖలైతే.. అందులో 25 పిటిషన్లు సివిల్‌ వివాదాల్లో పోలీసుల జోక్యానికి సంబంధించినవేనని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. కాగా, హైదరాబాద్‌ బార్కస్‌లో 256 గజాల ఇంటి స్థలంపై వివాదం నెలకొంది. 

ఈ వివాదంలో సివిల్‌ పిటిషన్‌ వెనక్కి తీసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని మొహిసిన్‌ బఫానా అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. సివిల్ వివాదంలో పోలీసులు జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‎పై సోమవారం (జూన్ 17) విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 

సివిల్‌ కోర్టులో ఉన్న వివాదాల్లో మీ జోక్యం ఎందుకని పోలీసులను నిలదీసిన హైకోర్టు.. ఇళ్లు, స్థలాల ఖాళీ చేయడం, రెంట్ కంట్రోల్‌ బాధ్యతలు మీకే అప్పగించాలా..? అలా అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేయమని ప్రభుత్వానికి చెప్పండని ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసు చట్టంలోని సెక్షన్‌ 19 మీ విధులేంటో చెబుతోంది. అయినా మీరు చట్టాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారని ప్రశ్నించింది. పోలీసులు సివిల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది.